లక్నో, ఏప్రిల్ 26: సెబీ తీరుపై సహారా ఇండియా మరోసారి ధ్వజమెత్తింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సెబీ ఖాతాలో వడ్డీతోసహా రూ.25,000 కోట్లకుపైగా సొమ్మును జమ చేశామని సహారా తెలియజేసింది. తొమ్మిదేండ్లు గడిచినా తమ ఇన్వెస్టర్లకు డిపాజిట్ చేసిన ఈ సొమ్మును సెబీ చెల్లించడం లేదని మండిపడింది. ఈ నగదంతా సెబీ వద్దనే నిరుపయోగంగా పడి ఉన్నదన్న సహారా.. కేవలం దాదాపు రూ. 125 కోట్లే ఇప్పటిదాకా ఇన్వెస్టర్లకు అందిందని సహా రా వెల్లడించింది.
నిజానికి తాము డిపాజిట్ చేసిన సొమ్మును తమ ఇన్వెస్టర్లకు ఇవ్వలేకపోతే.. తిరిగి తమకే అప్పగించాలని సెబీకి సుప్రీం కోర్టు 2012 డిసెంబర్ 5నే చెప్పిందని సహారా ఈ సందర్భంగా గుర్తుచేసింది. అయినప్పటికీ సెబీ ఆ ఆదేశాలను పాటించడం లేదని, ఇది సరికాదని హితవు పలికింది. మదుపరుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇకనైనా వెంటనే ఆ సొమ్మును సెబీ తిరిగిచ్చేయాలని, తాము ఇన్వెస్టర్లకు ఇస్తామని సహారా తెలిపింది.