Adani Group | న్యూఢిల్లీ, జూలై 10: తాము గతంలో నిబంధనలు మార్చినంత మాత్రాన ఆఫ్షోర్ ఫండ్స్ (విదేశీ ఫండ్స్) పెట్టుబడుల వెనుక లబ్ధిదారులు ఎవరో గుర్తించడం కష్టతరం కాదని సుప్రీం కోర్టుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. ఈ పెట్టుబడుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తేలితే చర్యలు తీసుకుంటామన్నది. అదానీ గ్రూప్ పన్ను రహిత దేశాల్లో నెలకొల్పిన డొల్ల కంపెనీల ద్వారా పెట్టుబడుల్ని తరలించి, ఆ గ్రూప్ షేర్లను కృత్రిమంగా పెంచుకున్నదంటూ హిండెన్బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసింది.
అయితే 2014-19 మధ్యకాలంలో సెబీ నిబంధనల్లో జరిగిన పలు సవరణల కారణంగా రెగ్యులేటర్కు దర్యాప్తు సామర్థ్యం కొరవడి ఉండవచ్చని, అందుచేతే ఆఫ్షోర్ ఫండ్స్ పెట్టుబడుల్లో ఉల్లంఘనల్ని గుర్తించలేకపోతున్నదని కమిటీ వివరించింది. దీనిపై సెబీ తాజాగా సుప్రీంకు ఒక అఫిడవిట్ను సమర్పిస్తూ విదేశీ ఫండ్స్ పెట్టుబడుల వెనుక ఎవరున్నారో గుర్తించడం కష్టతరమన్న నిపుణుల కమిటీ అభిప్రాయాన్ని అంగీకరించడం లేదని తెలిపింది. ఉల్లంఘనలు జరిగినట్టు కనుగొంటే తగిన చర్యలు తీసుకుంటామని సెబీ అఫిడవిట్లో స్పష్టం చేసింది. కాగా, అదానీ-హిండెన్బర్గ్ కేసును చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారించనుంది.