హైదరాబాద్ సెజ్తో కలిసి ఏర్పాటు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని జీఎమ్మార్ ఇండస్ట్రియల్ పార్కు వద్ద ప్రపంచస్థాయి ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు జీఎమ్మార్ గ్రూప్ అనుబంధ సంస్థ జీఎమ్మార్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్ లిమిటెడ్ (జీహెచ్ఏఎస్ఎల్), ప్రముఖ ఫ్రెంచ్ ఎనర్జీ అండ్ ఆటోమేషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్ ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 18 ఎకరాల్లో అత్యాధునిక ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కానుంది. దీన్ని నిర్మించి ష్నైడర్ ఎలక్ట్రిక్కు జీహెచ్ఏఎస్ఎల్ లీజుకు ఇవ్వనున్నది.
రెండు దశల్లో ఈ యూనిట్ నిర్మాణం జరుగుతుంది. తయారీ కేంద్రాన్ని మొదటి దశలో 2 లక్షల చదరపు అడుగుల్లో విస్తరిస్తారు. కార్యకలాపాలు మొదలయ్యేలా వచ్చే ఏడాది జూన్ నాటికి ష్నైడర్కు అందిస్తారు. ఇక రెండో దశలో ఈ ఫెసిలిటీని అదనంగా మరో 1.75 లక్షల చదరపు అడుగులకు విస్తరించనున్నారు. ఈ సందర్భంగా జీఎమ్మార్ గ్రూప్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ సీఈవో అమన్ కపూర్ మాట్లాడుతూ.. ష్నైడర్తో ఒప్పందం సంతోషకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం, జీఎమ్మార్తో కలిసి ప్రపంచస్థాయి ఉత్పత్తి కేంద్ర నిర్మాణంలో భాగస్వాములు కావడం గొప్పగా ఉందని ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ రీజియన్ గ్లోబల్ సైప్లె చైన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జావేద్ అహ్మద్ అన్నారు