Schneider Electric | బెంగళూరు, మార్చి 21: ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్..వచ్చే రెండేండ్లలో భారత్లో రూ.3,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. దేశీయంగా తన ఉత్పత్తులను విక్రయించడంతోపాటు విదేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేసే ఆలోచనలోఉన్న సంస్థ భారత్ను తయారీ హబ్గా మార్చేందుకు ప్రణాళికలను వేగవంతం చేసింది. దీంట్లోభాగంగానే బెంగళూరులో రూ.100 కోట్ల పెట్టుబడితో కూలింగ్ సొల్యూషన్స్ కోసం ప్రత్యేకంగా డాటా సెంటర్ను ప్రారంభించింది.
ఈ సందర్భంగా ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రెసిడెంట్ దీపక్ శర్మ మాట్లాడుతూ..ఈ పెట్టుబడులతో దేశవ్యాప్తంగా పలు ఉత్పత్తులను తయారు చేయడానికి ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, బెంగాల్, ఉత్తరాఖండ్, ఒడిశాల్లో కొత్తగా ప్లాంట్ను నెలకొల్పబోతున్నది. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా 30 ఫ్యాక్టరీలు ఉన్నాయి.