న్యూఢిల్లీ, జూలై 11: పరారీ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. ధిక్కరణ కేసులో సోమవారం జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం మాల్యాకు జైలు శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా కూడా వేసింది. ‘నిజానిజాలు, పరిస్థితులు గమనించిన మీదట చట్టం గౌరవాన్ని కాపాడేందుకు ఈ కేసులో మాల్యాకు తగిన శిక్ష పడాల్సిందే. అతని తీరు ఆక్షేపనీయం. తన ప్రవర్తనపట్ల అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం కూడా కనిపించట్లేదు’ అంటూ ధర్మాసనం ఈ సందర్భంగా మండిపడింది. బ్రిటన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అయినా ఏమీ చేయలేకపోతున్నామంటూ ఈ కేసులో సుప్రీం కోర్టు ఒకింత అసహనాన్నీ వ్యక్తం చేసింది.
ఇప్పటికే చాలాకాలం ఈ కేసులో వేచిచూశామని, ఇక వేచిచూడటం కుదరదని తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే అతన్ని హాజరుపర్చాలని కేంద్ర హోం శాఖకూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ తన పిల్లలకు మాల్యా రూ.4 కోట్లను బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో 2017 మే నెలలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాల్యా పిటిషన్ దాఖలు చేశారు. అయితే మాల్యాది కోర్టు ధిక్కరణేనంటూ 2020లో సుప్రీం కోర్టు సదరు పిటీషన్ను కొట్టివేసింది. ఈ క్రమంలో పలుమార్లు ఈ ధిక్కరణ కేసులో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ మాల్యాను సుప్రీం ఆదేశించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 10న చివరిసారిగా అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పు వెలువడింది. ఇదిలావుంటే నాలుగు వారాల్లో ఆ రూ.4 కోట్లను 8 శాతం వార్షిక వడ్డీతో డిపాజిట్ చేయాలని, లేనిపక్షంలో మాల్యా ఆస్తులను సంబంధిత అధికారులు జప్తు చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఈ నాలుగు వారాల్లో రూ.2వేల జరిమానా కూడా చెల్లించాలని, లేదంటే జైలు శిక్ష మరో 2 నెలలు పెరుగుతుందనీ కోర్టు తెలియజేసింది. కాగా, మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బ్యాంకులకు రూ.9,000 కోట్లు బకాయిపడ్డ విషయం తెలిసిందే. ఈ రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి మాల్యా పారిపోగా.. 2016 మార్చి నుంచి బ్రిటన్లోనే ఉంటున్న సంగతీ విదితమే.