ముంబై: వచ్చేనెల నుంచి దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారుల లావాదేవీలపై చార్జీలు సవరించింది. జీరో బ్యాలెన్స్ ఖాతాగా ప్రసిద్ధి చెందిన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాదారుల లావాదేవీల చార్జీలు కూడా పెరుగనున్నాయి.
బీఎస్బీడీ ఖాతాదారుల శాఖలు, ఏటీఎంల నుంచి చేసే నగదు విత్ డ్రాయల్స్, చెక్ లావాదేవీలు, నగదు బదిలీ, ఇతర నాన్ ఫైనాన్సియల్ లావాదేవీలకు ఫీజు వసూలు చేస్తుంది ఎస్బీఐ. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమలులోకి వస్తాయని ఎస్బీఐ వెబ్సైట్ ప్రకటించింది.
బీఎస్బీడీ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ 10 చెక్ లీవ్స్ను ఉచితంగా ఇస్తుంది. అంతకు మించితే మాత్రం కొంత మొత్తం చార్జీ వసూలు చేస్తుంది. తరువాత అందించే చెక్కులకు కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది.
10 చెక్ లీవ్స్తో కూడిన బుక్పై రూ.40 ప్లస్ జీఎస్టీ, 25 లీవ్స్ చెక్బుక్పై రూ.75 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తుంది. అయితే, కొత్త చెక్బుక్ సర్వీస్ చార్జీల నుంచి సీనియర్ సిటిజన్లకు మినహాయింపునిచ్చింది.
ఒక నెలలో ఎస్బీ బ్యాంక్ శాఖలు, ఏటీఎంల వద్ద కలిపి 4 సార్లు జరిపే లావాదేవీలు ఉచితం. అంతకు మించి లావాదేవీలు జరిపితే చార్జీ చెల్లించాల్సిందే.
పరిమితి దాటిన తర్వాత చేసే విత్ డ్రాయల్ లేడా డిపాజిట్పై రూ.15 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తుంది. హోం బ్రాంచ్తోపాటు ఎస్బీఐయేతర ఏటీఎం వద్ద విత్ డ్రాయల్ చేసినా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్బీఐ, ఎస్బీఐయేతర బ్యాంక్ల శాఖల్లో బీఎస్బీడీ ఖాతాదారుల ఆర్థికేతర లావాదేవీలపై చార్జీలు వసూలు చేయరు. ఈ ఖాతాదారులకు బ్రాంచ్లు, ప్రత్యామ్నాయ మార్గాల్లో చేసే లావాదేవీలు కూడా ఉచితం.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎస్బీఐ నాన్ హోం బ్రాంచ్ల్లో చెక్ లేదా, క్యాష్ విత్ డ్రాయల్ ఫామ్తో నగదు ఉపసంహరణ పరిమితిని పెంచింది.
చెక్ ద్వారా రూ. లక్ష, ఎస్బీ ఖాతా పాస్బుక్తో రూ.25 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ క్యాష్ విత్డ్రాలను నెలకు రూ.50 వేలకు పరిమితం చేసింది. ఇవి చెక్ను ఉపయోగించి మాత్రమే చేయాలి.
ఎస్బీఐ బీఎస్బీడీ ఖాతా అంటే జీరో బ్యాలెన్స్ ఖాతాగా ప్రసిద్ధి చెందాయి. సమాజంలోని పేద వర్గాల ప్రజలు ఈ ఖాతాలు తెరుస్తారు. సాధారణ పొదుపు ఖాతాలకు వర్తించే వడ్డీ రేట్లే జీరో బ్యాలెన్స్ ఖాతాలకూ వర్తిస్తాయి.