న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.13,265 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.7,627 కోట్ల లాభంతో పోలిస్తే 74 శాతం వృద్ధిని కనబరిచింది. బ్యాంక్ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయిలో లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, అధిక వడ్డీ ఆదాయం సమకూరడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికి బ్యాంక్ రూ.88,734 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇది రూ.77,789.09 కోట్లుగా ఉన్నది.
నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 13 శాతం ఎగబాకి రూ.31,184 కోట్ల నుంచి రూ.35,183 కోట్లకు చేరింది.
ఏడాది క్రితం 4.90 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల విలువ గడిచిన త్రైమాసికంలో 3.52 శాతానికి తగ్గినట్లు ప్రకటించింది.
నికర ఎన్పీఏ కూడా 1.52 శాతం నుంచి 0.80 శాతానికి దిగొచ్చింది.
మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.2,011 కోట్ల నిధులను వెచ్చించింది.
కన్సాలిడేటెడ్ విషయానికి వస్తే రూ. 1,14,782 కోట్ల ఆదాయంపై రూ. 14,752 కోట్ల లాభాన్ని ఎస్బీఐ ఆర్జించింది.
బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 13.35 శాతం నుంచి 13.51 శాతానికి చేరుకుంది.
గత త్రైమాసికంలో బ్యాంక్కు వడ్డీల ద్వారా వచ్చే స్థూల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగి రూ.79,860 కోట్లకు చేరుకున్నది.
రూ.9.2 లక్షల కోట్ల రుణాల్లో కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన వాటా 40 శాతంగా ఉన్నది.
బ్యాంక్ అడ్వాన్స్లు 20 శాతం ఎగబాకి రూ.30.35 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డిపాజిట్లు 9.99 శాతం పెరిగి రూ.41.9 లక్షల కోట్లకు చేరాయి.
‘బ్యాంక్కు వచ్చిన మొత్తం ఆదాయంలో నాలుగోవంతు రూ.24,400 కోట్లు పెట్టుబడుల ద్వారా సమకూరడం వల్లనే రికార్డు స్థాయి లాభాలను ఆర్జించగలిగాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో 14-16 శాతం వృద్ధి సాధిస్తాం.
– దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్