SBI Home Loans | ఇండ్ల రుణాలపై ఎస్బీఐ వడ్డీరేట్లను సవరించింది. గతవారం ఆర్బీఐ 25 బేసిక్ పాయింట్లు పెంచడంతో రెపోరేట్ 6.50 శాతానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఎస్బీఐలో ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు పెరిగాయి. ఫలితంగా నెలవారీ వడ్డీరేట్ (ఈఎంఐ) మరింత భారం కానున్నది. ఎస్బీఐ తన ఎంసీఎల్ఆర్, ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ రుణాలపై వడ్డీరేట్లు 10 బేసిక్ పాయింట్లు సవరించింది. తక్షణం పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం నెల, మూడు నెలల గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 8 నుంచి 8.10 శాతానికి పెరిగింది. ఆరు నెలలు, ఏడాది గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.40, 8.50 శాతానికి పెరిగాయి. ఆటోమొబైల్తోపాటు హోం, పర్సనల్ లోన్లపై వడ్డీరేట్లు ఎంసీఎల్ఆర్తోనే గణిస్తారు. ఇక రెండేండ్ల గడువు గల ఇండ్ల రునాలపై ఎంసీఎల్ఆర్ 8.50 నుంచి 8.60, మూడేండ్ల గడువు గల రుణాలపై 8.60 నుంచి 8.70 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది.
సిబిల్ స్కోర్ 800 పాయింట్లు అంతకంటే ఎక్కువగా ఉంటే ఇండ్ల రుణాలపై వడ్డీరేటు 9.15 శాతం అమలు అవుతుంది. రిస్క్ ప్రీమియం ఉండదు. క్రెడిట్ స్కోర్ను బట్టి రిస్క్ ప్రీమియం నిర్ణయిస్తారు. సిబిల్ స్కోర్ తగ్గినా కొద్దీ రిస్క్ ప్రీమియం పెరిగి వడ్డీరేట్ల పెంపునకు దారి తీస్తుంది. సాధారణంగా రిస్క్ ప్రీమియం ప్రకారం 10 బేసిక్ పాయింట్లు వడ్డీరేటు పెరుగుతుంది.
సిబిల్ స్కోర్ 750 -799 మధ్య ఉంటే వడ్డీరేటు 9.25 శాతం, సిబిల్ స్కోర్ 700-749 మధ్య ఉంటే వడ్డీరేటు 9.35 శాతం, క్రెడిట్ స్కోర్ 650-699 మధ్య ఉంటే వడ్డీరేట్లు 9.45 శాతంగా ఖరారవుతుంది. ఇక మహిళా రుణ గ్రహీతలకు అదనంగా రుణాలపై వడ్డీరేటుపై 0.05 శాతం మినహాయింపు ఇస్తున్నది ఎస్బీఐ. ఈ మినహాయింపును వచ్చే మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.