ముంబై : ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీ రేట్లు పెంచేందుకు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ సన్నద్ధమైంది. రెపో రేటును ఆర్బీఐ బుధవారం రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన క్రమంలో రుణాలపై వడ్డీరేట్లతో పాటు ఎఫ్డీలపైనా వడ్డీ రేట్ల పెంపునకు బ్యాంకులు కసరత్తు సాగిస్తున్నాయి.
ఎఫ్డీలపై వడ్డీరేట్లు పెరుగుతాయని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా వెల్లడించారు. నూతన ఎఫ్డీలపై తాజా వడ్డీ రేట్లు వర్తిస్తాయని, ఇప్పటికే వివిధ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై తాము వడ్డీరేట్లను పెంచామని ఎస్బీఐ చీఫ్ తెలిపారు. ప్రస్తుతం ఏడాది నుంచి రెండేండ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై ఎస్బీఐ కస్టమర్లకు 5.10 శాతం చొప్పున వడ్డీ లభిస్తోంది.
ఐదేండ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 5.45 శాతం వడ్డీరేటు అమల్లో ఉంది. ఇక ఆర్బీఐ రెపో రేటును పెంచడంతో రుణాలపై వడ్డీరేట్లు అధికం కావడంతో కస్టమర్లపై ఈఎంఐల భారం పెరగనుంది. రెపో రేటుకు అనుగుణంగా రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయని దినేష్ కుమార్ తెలిపారు.