శత్రువుల పీచమణిచేందుకు సైన్యానికి అధునాతన ఆయుధాలను అందించే డీఆర్డీవో.. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు సరికొత్త అస్ర్తాన్ని సిద్ధం చేసింది. డాక్టర్ రెడ్డీస్, సీసీఎంబీ సహకారంతో 2-డియాక్సీ డీ గ్లూకోజ్ (2-డీజీ) అనే ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీనికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు జారీచేసింది.
మధ్యస్థ, తీవ్రస్థాయి లక్షణాలున్న కరోనా రోగుల చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. బాధితులు వేగంగా కోలుకొనేలా చేయడంతోపాటు కృత్రిమ ఆక్సిజన్ అవసరాన్ని కూడా ఇది గణనీయంగా తగ్గిస్తుందని రక్షణశాఖ తెలిపింది. దేశంలో మెడికల్ ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ ఔషధం కీలకంగా మారనున్నది. ఇది పొడి రూపంలో లభిస్తుంది. నీటితో కలిపి వాడాల్సి ఉంటుంది. ధరను ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, ఒక్కో సాచెట్ ధర రూ.500-600 వరకు ఉండొచ్చని అంచనా.
న్యూఢిల్లీ, మే 8: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో మహమ్మారిపై పోరుకు మరో స్వదేశీ ఔషధం అందుబాటులోకి వచ్చింది. అది కూడా రక్షణరంగ సంస్థ నుంచి రావటం విశేషం. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన 2-డీయాక్సీ-డి-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధం అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసింది. రక్షణశాఖ శనివారం ఈ విషయం వెల్లడించింది. మధ్యస్థాయి నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కరోనా రోగులకు ఈ ఔషధాన్ని వినియోగిస్తారు.
దవాఖానలో చేరిన కరోనా రోగులు వేగంగా కోలుకునేలా చేయడంతోపాటు కృత్రిమ ఆక్సిజన్పై ఆధారపడటాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుందని రక్షణశాఖ తెలిపింది. ‘చాలా మంది కరోనా రోగులు ఆక్సిజన్పై ఆధారపడాల్సి వస్తున్నది. ఈ ఔషధం ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుతుందని భావిస్తున్నాం. కొవిడ్ రోగులు చికిత్స కోసం దవాఖానలో ఉండే కాలవ్యవధిని కూడా ఇది తగ్గిస్తుంది’ అని వెల్లడించింది. డీఆర్డీవోకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) సంయుక్తంగా ఈ మందును అభివృద్ధి చేశాయి. ప్రధాన చికిత్సకు అనుబంధంగా ఈ ఔషధాన్ని వినియోగించేందుకు ఈ నెల 1న డీసీజీఐ అనుమతులు ఇచ్చినట్టు రక్షణ శాఖ శనివారం తెలిపింది.
నీటిలో కలిపి తీసుకోవాలి
2-డీజీ ఔషధం పౌడర్ రూపంలో లభిస్తుంది. దీనిని నీటిలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఔషధం వైరస్ సోకిన కణాల్లోకి చేరి వైరస్ వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. సాధారణంగా కరోనా వైరస్ ఒక కణంలోకి చేరాక ఆర్ఎన్ఏను వృద్ధి చేయడం ద్వారా కొత్త వైరస్ కణాలను తయారుచేస్తుంది. అవి ఇతర కణాలకు విస్తరించి వ్యాధి తీవ్రతను పెంచుతాయి. 2-డీజీ ఈ ప్రక్రియను నిలువరిస్తుంది. ఆర్ఎన్ఏను వృద్ధి చేసేందుకు కావాల్సిన శక్తి (గ్లూకోజ్) వైరస్కు అందకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా వైరస్ వృద్ధి నిలిచిపోయి రోగి వేగంగా కోలుకుంటారు. 65 ఏండ్లు పైబడినవారిపైనా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుండటం విశేషం. రోజుకు రెండు సాచెట్ల (ప్యాకెట్ల) ఔషధం తీసుకున్న కరోనా రోగుల్లో 42 శాతం మందికి మూడో రోజునే కృత్రిమ ఆక్సిజన్ను తొలగించినట్టు రక్షణ శాఖ తెలిపింది. సాధారణ చికిత్స (స్టాండర్డ్ ట్రీట్మెంట్) తీసుకున్న వారిలో 30 శాతం మందికి మూడో రోజున ఆక్సిజన్ను తొలగించినట్టు పేర్కొన్నది. దేశంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఔషధం కీలకం కానున్నది.
గతేడాది ఏప్రిల్లో ప్రయోగాలు ప్రారంభం
గతేడాది ప్రారంభంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు డీఆర్డీవో ఈ ప్రాజెక్టుపై పని ప్రారంభించిందని రక్షణశాఖ తెలిపింది. గతేడాది ఏప్రిల్లో హైదరాబాద్లోని ‘సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులార్ బయాలజీ’ (సీసీఎంబీ) సహకారంతో ఇన్మాస్-డీఆర్డీవో శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిర్వహించగా, సార్స్కోవ్-2 వైరస్పై ఈ ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలిందని వివరించింది. ఈ ఫలితాల ఆధారంగా 2-డీజీ ఫేజ్-2 ట్రయల్స్కు గతేడాది మేలో డీసీజీఐ అనుమతులు మంజూరుచేసిందని తెలిపింది. గతేడాది మే-అక్టోబర్ మధ్య ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారని, కొవిడ్ రోగులపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలిందని రక్షణశాఖ పేర్కొన్నది. మొత్తంగా 110 రోగులపై ఫేజ్-2 ట్రయల్స్ చేపట్టినట్టు వెల్లడించింది. ఆశాజనక ఫలితాలతో గతేడాది నవంబర్లో ఫేజ్-3 ట్రయల్స్కు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. తెలంగాణ, ఏపీతో పాటు వివిధ రాష్ర్టాల్లోని 27 దవాఖానల్లో 220 మంది రోగులపై గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య ఫేజ్3 ట్రయల్స్ నిర్వహించినట్టు వెల్లడించింది.
ధర ఎంత?
ధర ఇంకా ప్రకటించలేదు. ఒక్కో సాచెట్ ధర రూ.500-600 ఉండొచ్చని అంచనా. దీనిని తయారు చేయడం సులభమని, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అందుబాటులోకి తేవొచ్చని డీఆర్డీవో తెలిపింది. దవాఖానల్లో వినియోగానికి డాక్టర్ రెడ్డీస్ ఇప్పటికే పరిమిత స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినట్టు సమాచారం.