Salesforce : ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యలు, పునర్వ్యవస్ధీకరణ ప్రణాళిక పేరుతో టెక్ దిగ్గజాలు ఎడాపెడా లేఆఫ్స్కు తెగబడుతుండటంతో టెకీల్లో గుబులు రేగుతోంది. అమెజాన్, గూగుల్, మెటా సహా పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ లేటెస్ట్ లేఆఫ్స్ బాంబు పేలుస్తున్నాయి. ఇక క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్ఫోర్స్ 700 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుందని వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. సేల్స్ఫోర్స్ గత ఏడాదిలోనూ పది శాతం సిబ్బందిపై వేటు వేయడంతో దాదాపు 8000 మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయారు.
టెక్ పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో ఇతర టెక్ కంపెనీల తరహాలోనే దీర్ఘకాలం నిలదొక్కుకునే వ్యూహంతో సేల్స్ఫోర్స్ సైతం సిబ్బంది సంఖ్యను కుదించింది. ఇక టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ లేఆఫ్స్లో భాగంగా గేమింగ్ డివిజన్లో 1900 మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు జర్మనీకి చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం శాప్ (SAP) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ఫోకస్ పెంచడంతో 8000 ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకం కానుంది. రూ. 18,000 కోట్ల పెట్టుబడులతో భవిష్యత్ వృద్ధి కోసం శాప్ డైనమిక్ టెక్ ల్యాండ్స్కేప్పై వెచ్చించనుంది.
శాప్ తదుపరి అధ్యాయంగా ఈ వ్యూహాత్మక మార్పును కంపెనీ సీఈవో క్రిస్టియన్ క్లీన్ పేర్కొన్నారు. శాప్లో ప్రపంచవ్యాప్తంగా 108000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కంపెనీ ఏఐ ఫోకస్తో పునర్వ్యవస్ధీకరణలో దాదాపు 7 శాతం మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. స్వచ్ఛందంగా ఉద్యోగులు వైదొలగడంతో పాటు ఉద్యోగుల నైపుణ్యాల పెంపుకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ మార్పులను సాఫీగా చేపట్టాలని శాప్ భావిస్తోంది. లేఆఫ్స్ ముద్ర పడకుండా కొందరు ఉద్యోగులను కంపెనీ నుంచి తప్పుకోవాలని శాప్ కోరనుంది.
Read More :