Kirana Stores | న్యూఢిల్లీ, నవంబర్ 28: గత కొంతకాలంగా కిరాణా స్టోర్లు లేదా సంప్రదాయ దుకాణాల్లో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాలు క్రమేణా మందగిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న కిరాణాల్లో ఈ పరిస్థితి.. ఆయా సంస్థలకు వ్యాపారాన్ని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత కొనుగోలుదారులను దూరం చేస్తున్నది. దీంతో ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలో మెజారిటీ వాటాదారులైన మారికో, డాబర్, ఇమామీ, బజాజ్ కన్జ్యూమర్ సంస్థలు వ్యూహాత్మక ప్రణాళికల్ని ఆచరణలో పెట్టేందుకు సిద్ధమయ్యాయి.
ఈ-కామర్స్ సంస్థలు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి వేగంగా విస్తరిస్తున్నాయి. ఇది స్థానిక కిరాణాల వ్యాపారానికి పెద్ద ఎత్తునే గండి కొడుతున్నది. ఆన్లైన్లో కొత్తకొత్త ఉత్పత్తులు, తక్కువ ధరలకే లభిస్తుండటంతో కస్టమర్లు ఎగబడి కొనేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ కూడా అందరికీ అందుబాటులో ఉండటం.. ఆన్లైన్ వ్యాపార సంస్థలకు కలిసొస్తున్నది. అయితే ఆన్లైన్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల్లో చాలావరకు ప్రధాన సంస్థలవి కావు. దీంతో కిరాణా వ్యాపారుల్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపకుంటే తమ ఉనికికే ప్రమాదం అని భావిస్తున్న బడా ఎఫ్ఎంసీజీ సంస్థలు.. గ్రామీణ ప్రాంత కొనుగోలుదారులే లక్ష్యంగా మార్కెట్లోకి రాబోయే త్రైమాసికాల్లో మరిన్ని కొత్త ఉత్పత్తుల్ని సరసమైన ధరలకే తీసుకురావాలని యోచిస్తున్నాయిప్పుడు.
వ్యాపారం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కిరాణా వ్యాపారులు హోల్సేల్ మార్కెట్లో ఉద్దెరపై ఇప్పటికే తీసుకున్న ఉత్పత్తుల బాకీలను చెల్లించలేకపోతున్నారు. దీంతో దుకాణాల్లో సరుకులు నిండుకున్నా కొందరు అరకొర ఉత్పత్తులతోనే వ్యాపారాలు చేస్తుండగా, మరికొందరు పెట్టుబడుల్లేక స్టోర్లనే మూసేస్తున్నారు. ఇక రిలయన్స్ రిటైల్, డీ-మార్ట్ వంటి స్టోర్లతోనూ కిరాణాలకు దెబ్బ తగులుతున్నది. దీంతో కొత్తగా క్రెడిట్ లభించేలా హోల్సేల్ మార్కెట్ ద్వారా రిటైల్ వ్యాపారులకు సంకేతాలిచ్చే యోచనలోనూ కంపెనీలు ఉన్నట్టు తెలుస్తున్నది.
గ్రామీణ ప్రాంత వ్యాపారాన్ని పెంచే దిశగా బడా కంపెనీల అడుగులు
కిరాణా స్టోర్లలో ట్రూ ఎలిమెంట్స్, ప్లిక్స్ వంటి డిజిటల్ బ్రాండ్స్ను అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్న మారికో
కిరాణా దుకాణాల్లో మరింత తక్కువ, సరసమైన ధరలకు ఆకర్షణీయమైన ఉత్పత్తులను తెచ్చే యోచనలో డాబర్
ది మ్యాన్ కంపెనీ, బ్రిల్లారేవంటి ఆన్లైన్ బ్రాండ్స్ను ఆఫ్లైన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని చూస్తున్న ఇమామీ
ఆన్లైన్ మార్కెట్కోసం తెచ్చిన ఉత్పత్తులను ఆఫ్లైన్లోనూ అమ్మేందుకు సిద్ధమైన టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వివిధ మార్పుల దిశగా చర్యలు
అక్టోబర్లో మూతబడిన రిటైల్ స్టోర్లు 3.4% ఈ ఏడాది ఆగస్టుతో పోల్చితే..
ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో చాలా వరకు ఎఫ్ఎంసీజీ సంస్థలు సంప్రదాయ మార్కెట్లో అమ్మకాలు తగ్గినట్టు చూపాయి
గతి తప్పిన కిరాణా స్టోర్ల వ్యాపారాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు రాబోయే త్రైమాసికాల్లో ఓ పక్కా ప్రణాళికతో ముందుకెళ్లనున్నాం. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొత్త ఉత్పత్తులను తీసుకొస్తాం.
-సౌగతా గుప్తా, మారికో ఎండీ
కిరణా వ్యాపారులకు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే పెద్ద ఎత్తున క్రెడిట్ ఇచ్చారు. సకాలంలో అవి తిరిగి వసూలు కావడం లేదు. దీంతో దుకాణదారులకు కొత్త అప్పులు సమస్యగా మారుతున్నాయి. ఇది స్టోర్ల మూసివేతకు దారితీస్తున్నది.
-మయాంక్ షా, పార్లే ప్రోడక్ట్స్ సీనియర్ కేటగిరీ అధిపతి