హైదరాబాద్/సైదాబాద్, ఫిబ్రవరి 22: నగర ప్రజలకు సురక్షితమైన, నమ్మదగిన రవాణా సదుపాయాన్ని అందిస్తూ.. ప్రయాణికులను సమయానికి గమ్యస్థానాలకు చేర్చడంలో ర్యాపిడో కీలకపాత్ర పోషిస్తున్నదని ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన పవన్ గుంటుపల్లి అన్నారు. అదే మా లక్ష్యం కూడా అని స్పష్టం చేశారు. గురువారం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని చంపాపేట మినర్వా గార్డెన్లో జరిగిన ర్యాపిడో క్యాబ్ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గత ఏడాది మే నెలలో హైదరాబాద్ నగరంలో ర్యాపిడో క్యాబ్స్ రంగంలోకి దిగాయని, అప్పుడే 50 వేలకుపైగా క్యాబ్ కెప్టెన్లను కలిగి ఉన్నామన్నారు. ఇప్పటిదాకా 4 లక్షల రైడ్లను విజయవంతంగా పూర్తిచేసినట్టు తెలిపారు.
ఇక దేశవ్యాప్తంగా 3 లక్షల కెప్టెన్లు తమ వేదికపైకి వచ్చారని, సాస్ ఆధారిత మాడల్ ఉపాధి పొందటానికి అనేక అవకాశాలున్నాయని వివరించారు. కనీస సభ్యత్వ రుసుము చెల్లించి, ఆన్లైన్ ద్వారా కార్యకలాపాలను సులువుగా పొందటానికి, కెప్టెన్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటూ వెళ్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్లోనూ కెప్టెన్లకు మరింత ఆదాయం సమకూరేలా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం కెప్టెన్ల అభిప్రాయాలను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్నింటికి పరిష్కార మార్గాలనూ చూపించారు. ఇదిలావుంటే క్యాబ్ మహోత్సవంలో భాగంగా అంకిత భావంతో పనిచేస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న 1,500లకుపైగా కెప్టెన్లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. విలువైన ప్రశంసా పత్రాలను అందజేశారు.