Russia Invansion | రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో భారత్కు కొత్తగా కలిసి వచ్చే అవకాశాలు వచ్చాయి. ప్రపంచ దేశాలకు ఇండియా నుంచి గోధుమలు ఎగుమతి చేసే వీలు కలుగుతుందా.. అంటే అవుననే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు. ఇప్పటి వరకు వివిధ దేశాలకు గోధుమల ఎగుమతిలో రష్యాదే అగ్రస్థానం. సగటున 18 శాతానికి పైగా గోధుమలు రష్యా నుంచి ఎగుమతి అవుతాయి. 2019లో ప్రపంచ గోధుమల ఎగుమతుల మార్కెట్లో రష్యా ప్లస్ ఉక్రెయిన్ దేశాల వాటా 25.4 శాతం. ఇప్పుడు ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో వివిధ దేశాలు తమకు అవసరమైన గోధుమల కోసం భారత్ వైపు చూసే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం పూల్ వద్ద 24.2 మిలియన్ టన్నుల గోధుమల నిల్వలు ఉన్నాయి. ఇవి బఫర్, స్ట్రాటర్జిక్ అవసరాలతో పోలిస్తే రెండొంతులకంటే ఎక్కువేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రపంచ దేశాలకు 10 శాతం గోధుమలు ఎగుమతి చేయగల పరిస్థితిలో భారత్ ఉందని అధికార వర్గాల కథనం. అయితే, ఉక్రెయిన్ నుంచి భారత్ అధికంగా ఎనిమల్ అండ్ వెజిటబుల్ ఫ్యాట్స్, ఆయిల్స్ దిగుమతి చేసుకుంటున్నది.
మొత్తం గోధుమల దిగుమతిలో ఈజిప్ట్, టర్కీ, బంగ్లాదేశ్ దేశాల వాటా సగానికి పై చిలుకే. ప్రత్యేకించి ఈజిప్ట్ అత్యధికంగా గోధుమలు దిగుమతి చేసుకుంటున్నది. పది కోట్ల మందికి పైగా జనాభాకు ఆహార ధాన్యాల సరఫరా కోసం ఈజిప్ట్ దిగుమతి చేసుకునే గోధుమల విలువ 400 కోట్ల డాలర్లు. ఈజిప్ట్కు వివిధ దేశాల నుంచి గోధుమల ఎగుమతిలో రష్యా, ఉక్రెయిన్ వాటా 70 శాతానికి పైగానే ఉంటుంది. తర్వాతీ స్థానంలో ఉన్న టర్కీ మొత్తం గోధుమల దిగుమతిలో రష్యా, ఉక్రెయిన్ల నుంచి 74 శాతం ఉంటుంది. 2019లో దీని విలువ 160 కోట్ల డాలర్లు. వివిధ దేశాలకు గోధుమలు ఐదు దేశాల నుంచి ఎగుమతి అవుతుంటాయి. ఆ జాబితాలో రష్యా (790 కోట్ల డాలర్లు), అమెరికా (632 కోట్ల డాలర్లు), కెనడా (630 కోట్ల డాలర్లు), ఫ్రాన్స్ (450 కోట్ల డాలర్లు), ఉక్రెయిన్ (360 కోట్ల డాలర్లు) ఉన్నాయి.