ముంబై, సెప్టెంబర్ 23: డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం మరింత దిగజారింది. ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో 30 పైసలు పడిపోయి తొలిసారిగా 81ని దాటింది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా 81.09 వద్ద నిలిచింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో 81.23 స్థాయికీ పతనం కావడం గమనార్హం. కాగా, గురువారం రూపాయి మారకం విలువ 83 పైసలు క్షీణించిన విషయం తెలిసిందే. దాదాపు గడిచిన 7 నెలల్లో ఒక్కరోజే ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం.
ఇక వరుసగా మూడు రోజుల్లో రూపాయి మారకం విలువ 124 పైసలు పతనమైంది. ఉక్రెయిన్ సంక్షోభం ముదరడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్తోపాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరికొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం అదుపు దృష్ట్యా కీలక వడ్డీరేట్లను పెంచడం రూపాయికి ఇబ్బందుల్ని సృష్టిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరగడం, దేశీయ స్టాక్ మార్కెట్లూ భారీ నష్టాల్లోకి జారుకోవడం కూడా రూపాయిని కుదేలు చేసినట్టు చెప్తున్నారు.