ముంబై, ఫిబ్రవరి 13: రూపాయికి మరిన్ని చిల్లులు పడ్డాయి. అమెరికా కరెన్సీని కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడటంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు తగ్గి 83.08 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ నిరాశావాదంగా ఉండటం కరెన్సీ పతనానికి కారణమయ్యాయి.
ఫారెక్స్ మార్కెట్లో 83 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ చేటు ఒక దశలో 82.98 గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. చివరకు 83.08కి పడిపోయినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం రూపాయి విలువ 7 పైసలు పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, ఇజ్రాయిల్ విమానదాడులు చేయడం కరెన్సీ పతనానికి పరోక్షంగా కారణమయ్యాయి.