న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం ఒక్కరోజే 33 పైసలు పడిపోయింది. దీంతో కీలకమైన 83 స్థాయిని మరోమారు దాటి దేశీయ కరెన్సీ క్షీణించినైట్టెంది. భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లో అధిక ముడి చమురు ధరలు, అమెరికా డాలర్లకు ఫారెక్స్ మార్కెట్లో పెరిగిన డిమాండ్ మధ్య.. రూపాయి బలహీనపడుతున్నది.
ఈ క్రమంలోనే 83.04 వద్ద నిలిచింది. సోమవారం కూడా 9 పైసలు దిగజారిన విషయం తెలిసిందే. కాగా, ఆగస్టు 14 నుంచి డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 83 స్థాయిని దాటడం ఇది ఐదోసారి. ‘డాలర్లకు వ్యక్తమవుతున్న డిమాండ్కుతోడు నిరాశాజనక భారతీయ స్థూల ఆర్థిక గణాంకాలు సైతం రూపాయి పతనానికి దారితీస్తున్నాయి’ అని బీఎన్పీ పరిబాస్కు చెందిన షేర్ఖాన్ రిసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌధరీ అన్నారు. గత నెలలో దేశీయ సేవా రంగ కార్యకలాపాలు 60.1 స్థాయికే పరిమితమయ్యాయి. జూలైలో ఇది 62.3గా ఉన్నది. నిజానికి ఉదయం ఆరంభం నుంచే రూపాయి నష్టాలు మొదలయ్యాయి. సమయం గడుస్తున్నకొద్దీ ఇవి పెరుగుతూపోయాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా రుపీని దెబ్బతీశాయి. కాగా, డాలర్ ముందు నిలువలేకపోతున్న రూపాయిని బలపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగవచ్చన్న అభిప్రాయాన్ని చౌధరీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.