న్యూఢిల్లీ, ఆగస్టు 21: రూపాయి గింగిరాలు కొడుతున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయికి పడిపోతున్న దేశీయ కరెన్సీ విలువ సోమవారం మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 3 పైసలు తగ్గి 83.13కి జారుకున్నది. 83.10 వద్ద ప్రారంభమైన డాలర్-రుఫీ ఎక్సేంజ్ రేటు చివరకు 83.13 వద్ద ముగిసింది.
గత శుక్రవారం కూడా కరెన్సీ ఒక్క పైసా కోల్పోయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమనడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను తరలించుకోవడం వల్లనే రూపాయి ఒత్తిడికి గురైందని బీఎన్పీ పరిబాస్ హెడ్ అంజు చౌదరీ తెలిపారు. మరోవైపు, బ్రెంట్ కూడ్రాయిల్ ధరలు పెరగడం, దేశీయ మార్కెట్లు లాభపడినప్పటికీ కరెన్సీ పతనమవడం విశేషం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 1,901. 10 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అలాగే, ఈ నెల 11తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 708 మిలియన్ డాలర్లు పెరిగి 602.161 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.