Rupee | ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై సోమవారం రూపాయి మారకం విలువ మరో ఆల్ టైం కనిష్ట స్థాయికి పడిపోయింది. ముడి చమురు ధరలు పెరగడంతో, దేశీయ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో రూపాయిపై ప్రభావం చూపింది. ఇంట్రాడే ట్రేడింగ్లో డాలర్ మీద రూపాయి రూ. 83.10 వద్ద ప్రారంభమై రూ.83.05 – 83.16 మధ్య ఊగిసలాడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.83.13 వద్ద ముగిసింది. అంతర్జాతీయ పరిస్థితుల వల్లే రూపాయి పతనమైందని విదేశీ ఇన్వెస్టర్లు పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఒక పైసా పతనమై రూ.83.10 వద్ద ముగిసింది.
మార్కెట్ సెంటిమెంట్ను బలోపేతం చేయడానికి ఆర్థికవ్యవస్థకు ఉద్దీపన కల్పించేందుకు చైనా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లు 10 బేసిక్ పాయింట్లు తగ్గించి 3.45 శాతానికి కుదించేసింది. దీంతో చైనా యువాన్పై యూఎస్ డాలర్ క్షీణించింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా స్టాక్స్ విక్రయించారు. ఇదిలా ఉంటే సిక్స్ కరెన్సీల బాస్కెట్లో డాలర్ ఇండెక్స్ బలోపేతమైంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్పై 0.64 శాతం పెరిగి 83.84 డాలర్ల వద్ద నిలిచింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 267.43 పాయింట్ల లబ్ధితో 65,216.09 పాయింట్ల వద్ద స్థిర పడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) 83.45 పాయింట్లు పుంజుకుని 19,393.60 పాయింట్ల వద్ద నిలిచింది. సోమవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 1,901.10 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.