ముంబై, నవంబర్ 13: కొద్ది వారాలుగా ఆల్టైమ్ కనిష్ఠస్థాయి సమీపంలో అటూఇటూ కదులుతున్న రూపాయి సోమవారం రికార్డు కనిష్ఠస్థాయి 83.33 వద్దకు ముగిసింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) ఇంట్రాడే ట్రేడింగ్లో 83.39 వద్దకు పతనమైన రూపాయి చివరకు క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 5 పైసలు నష్టపోయి 83.33 వద్ద ముగిసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 18న ముగింపు 83.32 ఇప్పటివరకూ రికార్డు కనిష్ఠ ముగింపు.
ఆర్బీఐ మద్దతు వ్యర్థం
దేశీయ నిరుత్సాహకర ఆర్థికాంశాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడటం, భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా నిధులు తరలించుకుపోవడం, మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతలు తదితర ప్రతికూల అంశాల నడుమ రిజర్వ్బ్యాంక్ ప్రభుత్వ బ్యాంక్ల సాయంతో డాలర్లను విక్రయించి, రూపాయికి మద్దతు ఇచ్చినప్పటికీ భారత్ కరెన్సీ నిలబడలేదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. డాలర్ ఇండెక్స్ 10 నెలల గరిష్ఠస్థాయి 105.80 వద్ద ట్రేడవుతున్నది.
ఆర్థిక గణాంకాలతో నీరసిస్తున్న రూపాయి
ఇటీవల వెలువడిన దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు నిరుత్సాహంగా ఉండటం, ఎఫ్పీఐల అమ్మకాలు రూపాయిపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు గత ఏడాదితో పోలిస్తే 37 శాతం నుంచి 39 శాతానికి పెరగడం, ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మౌలిక రంగాల వృద్ధి రేటు సెప్టెంబర్ నెలలో 8 శాతానికి పరిమితం కావడం ఆందోళనకర అంశాలేనని వారంటున్నారు. పారిశ్రామిక రంగం వృద్ధి అక్టోబర్ నెలలో 5.8 శాతానికి తగ్గడమూ రూపాయిపై ప్రభావం చూపించింది.