కోల్కతా, మే 29: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘యాస్’ తుఫాన్ ప్రభావంపై సమీక్ష నిర్వహించేందుకు రాష్ర్టానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీని కావాలనే 30 నిమిషాలపాటు ఎదురుచూసేలా చేశారంటూ బీజేపీ నేతలు చేసిన విమర్శలను శనివారం మమత తిప్పికొట్టారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తనపై కావాలనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. ఏకపక్షంగా, పక్షపాతపూరితంగా ఉన్న ఆ వార్తల్లో ఎలాంటి నిజంలేదన్నారు. దుష్ప్రచార రాజకీయాలను విడిచిపెట్టాలని హితవు పలికారు. ‘నన్ను ఇలా అవమానించొద్దు. బెంగాల్లో మా పార్టీ ఘన విజయం సాధించింది. శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, మీరు (బీజేపీ) ఓడిపోయారు. అందుకే ఇలా చేస్తున్నారా? రోజూ మాతో మీకు (కేంద్ర ప్రభుత్వం) పేచీలెందుకు?’ అని దీదీ నిలదీశారు. ప్రధాని మోదీని తాను ఉద్దేశపూర్వకంగానే ఎదురుచూసేలా చేశానన్న వార్తలను కూడా ఖండించారు. ప్రధాని కోసం తానే 20 నిమిషాల పాటు ఎదురుచూశానని బదులిచ్చారు. ప్రధాని మోదీ బెంగాల్ పర్యటన ఖరారు కాకమునుపే వరద ప్రభావిత జిల్లాల్లో తన పర్యటనకు సంబంధించిన ప్రణాళిక ఖరారు అయిందని, ప్రధాని అనుమతితోనే తాను సమావేశం నుంచి వెళ్లానని వివరించారు. ప్రధాని-ముఖ్యమంత్రి మధ్య జరుగాల్సిన సమావేశంలో గవర్నర్, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావం ఉన్న గుజరాత్, ఒడిశాలో జరిగిన పీఎం తుఫాన్ సమీక్షా సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలను ఎందుకు ఆహ్వానించలేదన్నారు.
బెంగాల్ ప్రధాన కార్యదర్శి అలాపన్ బంధోపాధ్యాయ్ని బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే, ప్రధాన కార్యదర్శి బదిలీ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని మమత ప్రధానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే బ్యూరోక్రాట్ వ్యవస్థనే అవమానించినట్లు అవుతుందన్నారు. కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయడం రాజకీయ దురుద్దేశమేనన్నారు. బెంగాల్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం, ప్రధాని మోదీ ఇగోను తృప్తిపర్చడానికి ఆయన (మోదీ) కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. బెంగాల్లో ఓటమిని మోదీ, అమిత్ షా జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.