న్యూఢిల్లీ, డిసెంబర్ 29: నిపుణుల కోసం రెండు పెద్ద టెక్నాలజీ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో ఉద్యోగులకు భారీ బోనస్ పంట పండుతున్నది. యాపిల్ తన ఇంజినీర్లకు అనూహ్యమైన రీతిలో రూ.1 కోటిపైగా బోనస్ ఇచ్చింది. ప్రత్యర్థి కంపెనీలకు వలసల్ని నిరోధించే క్రమంలో సిలికాన్ డిజైన్, హార్డ్వేర్, కొన్ని సాఫ్ట్వేర్ విభాగాల్లోని కొంతమంది ఇంజినీర్లు తాము అందుకున్న 50,000 డాలర్ల (రూ.37.5 లక్షలు) నుంచి 1,80,000 డాలర్ల (రూ.1.35 కోట్లు) బోనస్లను చూసి ఆశ్చర్యపోయారు. మరి కొంతమందికి 80,000 డాలర్లు, 1,00,000 డాలర్లు, 1,20,000 డాలర్ల మేర యాపిల్ షేర్ల రూపంలో బోనస్లు అందినట్లు పేర్లు తెలపడానికి ఇష్టపడని ఉద్యోగులు తెలిపారు. ఈ బోనస్ బొనాంజాకు.. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్ఫామ్స్ కారణమయ్యింది. కొద్ది నెలలుగా యాపిల్ నుంచి 100 మంది ఇంజినీర్లను ఫేస్బుక్ నియమించుకుంది. దీంతో యాపిల్ కూడా కీలకమైన మెటా ఉద్యోగుల్ని ఆకర్షించింది. ఈ రెండు కంపెనీలు వచ్చే రెండేండ్లలో ప్రధానమైన గాడ్జెట్స్ను విడుదల చేసేందుకు పోటీ పడుతున్నాయి. తాజాగా యాపిల్ ఇచ్చిన బోనస్లు సాధారణంగా ప్రతీ ఏటా ఇచ్చే బేసిక్ శాలరీ, స్టాక్ యూనిట్లు, నగదు బోనస్లకు అదనం.