Credit Suisse on Adani | అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక వెల్లడి కావడంతో భారత పారిశ్రామికవేత్త గౌతం అదానీకి ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ క్రెడిట్ సూయిజ్ షాక్ ఇచ్చింది. అదానీ కంపెనీల రుణాల బాండ్లను స్వీకరించడం నిలిపివేసింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై వంటి సంస్థలు విక్రయించిన రుణ బాండ్లకు రుణాలు కేటాయించలేదని తెలిపినట్లు వార్తలొచ్చాయి.దీంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
గత ఐదు సెషన్లలో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడో వంతు తుడిచి పెట్టుకుపోయింది. కేవలం బుధవారం నాడే సుమారు రూ.2 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అదానీ సంస్థలు నష్టపోయాయి.ఇంతకుముందు అదానీ పోర్ట్స్ జారీ చేసిన బాండ్ల విలువపై దాదాపు 75 శాతం రుణాలు మంజూరు చేసింది క్రెడిట్ సూయిజ్.
అదానీ గ్రూప్ సంస్థలకు తాకట్టు రుణాలు మంజూరు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్కు కూడా హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక సెగ తాకింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 5.7 శాతం నష్టపోయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎనిమిది శాతం వరకూ పతనం అయ్యాయి. అదానీ గ్రూప్ కంపెనీలకు ఆర్బీఐ లిమిట్ పరిధిలోనే రుణాలిచ్చామని ఇప్పటికే ప్రకటించిన ఎస్బీఐ స్క్రిప్ట్ 4.8 శాతం నష్టపోయింది.