ముంబై, జనవరి 20: దేశీ కుబేరుల్లో ద్వితీయస్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)ను కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విండ్ఫాల్ ట్యాక్స్ దెబ్బతీసింది. దీంతో 2022 డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆర్ఐఎల్ కన్సాలిడేటెడ్ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 15.5 శాతం క్షీణించి రూ. 15,792 కోట్లకు దిగివచ్చింది. ఆదాయం మాత్రం 15.3 శాతం వృద్ధితో రూ.2.20 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్ త్రైమాసికంకంటే ఆదాయం 15.6 శాతం పెరగ్గా, లాభం 5.3 శాతం పెరిగింది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులు, ముడి చమురు ఉత్పత్తిపై వచ్చే లాభాలపై విధించిన స్పెషల్ ఎక్సైజ్ సుంకం (విండ్ఫాల్ ట్యాక్స్) తమ లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించినట్టు ఆర్ఐఎల్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. గత మూడు నెలల్లో సంస్థ రూ. 1,899 కోట్లు విండ్ఫాల్ ట్యాక్స్గా చెల్లించింది. 2022 వ్యయాలు భారీగా పెరగడం కూడా లాభాల క్షీణతకు కారణమయ్యింది. ఆర్థిక ఫలితాల్ని పరిగణనలోకి తీసుకునేందుకు శుక్రవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు నాన్-కన్వర్ట్బుల్ డిబెంచర్లు జారీచేసి రూ. 20,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది.
రిలయన్స్ జియో నికరలాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో నికరలాభాన్ని, ఆదాయాన్ని పెంచుకుంది. 2021 డిసెంబర్తో ముగిసిన మూడు నెలలతో పోలిస్తే తాజాగా ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికరలాభం 28 శాతం వృద్ధిచెంది రూ.3,615 కోట్ల నుంచి రూ. 4,638 కోట్లకు పెరగ్గా, 2022 సెప్టెంబర్ క్వార్టర్లో గడించిన రూ.4,518 కోట్లకంటే డిసెంబర్లో 2.65 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. సమీక్షా త్రైమాసికంలో జియో ఆదాయం అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 18.87 శాతం పెరిగి రూ. 19,347 కోట్ల నుంచి రూ. 22,994 కోట్లకు చేరింది. అయితే 2022 సెప్టెంబర్ త్రైమాసికం (రూ.2,521 కోట్లు)కంటే పెరుగుదల 2.11 శాతం మాత్రమే.
ఆర్ఐఎల్ రిటైల్ సబ్సిడరీ రిలయన్స్ రిటైల్ నికరలాభం డిసెంబర్ త్రైమాసికంలో 6.2 శాతం వృద్ధిచెంది రూ.2,400 కోట్లకు చేరింది. ఆదాయం 17.1 శాతం పెరుగుదలతో రూ. 67,634 కోట్ల వద్ద నిలిచింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో రిటైల్ రూ. 57,717 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. సంస్థ ఇబిటా మాత్రం భారీగా 24.7 శాతం వృద్ధితో రూ. 4,786 కోట్లకు చేరింది. సంస్థ కొత్తగా 789 స్టోర్లను ప్రారంభించింది.
‘అన్ని వ్యాపార విభాగాలు కన్సాలిడేటెడ్ ఇబిటాకు వృద్ధిని చేకూర్చాయి. పెట్రో ఉత్పత్తులకు పటిష్టమైన డిమాండ్ ఉంది. అధిక సరఫరాతో కెమికల్ ఉత్పత్తులపై మార్జిన్ల ఒత్తిడి ఉంది. టెలికం వ్యాపారం రికార్డుస్థాయిలో ఆదాయాన్ని, ఇబిటాను సాధించింది. ఈ త్రైమాసికంలో ట్రూ 5జీ సర్వీసుల్ని ప్రారంభించాం. ఇప్పుడిది 134 నగరాలు, పట్టణాల్లో లభిస్తున్నది. మా రిటైల్ వ్యాపారం ద్వారా వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఉత్పత్తుల్ని అందించడంపై దృష్టి నిలిపాం’
-ముకేశ్ అంబానీ, చైర్మన్, ఆర్ఐఎల్