Reliance | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రిలయన్స్ గణనీయ లాభాలు గడించినా.. అంచనాలు అందుకోలేకపోయింది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ 46.29 శాతం నికర లాభం పెంచుకుని రూ.17,955 కోట్లు లాభ పడింది. గతేడాది తొలి త్రైమాసికంలో రూ.12,273 కోట్ల నికర లాభం గడించింది. అయితే, మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం రిలయన్స్ లాభం రూ.24,311 కోట్లకు చేరుతుందని భావించారు.
తొలి త్రైమాసికం ఆదాయంలో రిలయన్స్ 54.54 శాతం పురోగతి సాధించింది. 2021-22 తొలి త్రైమాసికంలో రూ.1,44,372 కోట్ల రెవెన్యూ గడించిన రిలయన్స్.. ఈ ఏడాది రూ.2,23,113 కోట్ల రెవెన్యూ పొందింది. మార్కెట్ విశ్లేషకులు రూ.2,44,244 కోట్ల ఆదాయం సంపాదిస్తుందని అంచనా వేశారు. రిలయన్స్ మార్జిన్లు 17 శాతం ఉంటాయని విశ్లేషకులు భావిస్తే.. వాస్తవ మార్జిన్లు 17.3 శాతానికి చేరుకున్నాయి.
ప్రస్తుత అనిశ్చిత వాతావరణంలోనూ అత్యధిక రెవెన్యూ సంపాదించామని రిలయన్స్ ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ ఆదాయం 51.9 శాతం వృద్ధితో రూ.58,554 కోట్లకు చేరుకున్నది. అలాగే రిలయన్స్ జియో కూడా ఆదాయంలో 23.6 శాతం పురోగతి నమోదు చేసుకుని రూ.27,527 కోట్ల వద్ద స్థిర పడింది.