హైదరాబాద్, నవంబర్ 18: శంషాబాద్ విమానాశ్రయం మరో రికార్డును సొంతం చేసుకున్నది. కేవలం అక్టోబర్లోనే ఈ విమానాశ్రయం ద్వారా 20 లక్షల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన వారితో పోలిస్తే 16 శాతం పెరిగి 20,50,789 ప్రయాణించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. పండుగ సీజన్ కావడంతోపాటు రాష్ట్రం నుంచి విదేశాలు వెళ్లేవారు అధికంగా ఉండటం ఇందుకు కారణమని విశ్లేషించింది. ప్రధానంగా పండుగ సీజన్లో పక్క రాష్ర్టాలకు చెందినవారు తమ సొంతూళ్లకు వెళ్లడానికి విమానాలనే ఎంచుకుంటున్నారు.
విమాన టిక్కెట్టు ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ సమయం కలిసిరానుండటంతో దీనికి మొగ్గుచూపుతున్నారు. అలాగే ఢిల్లీ ఎయిర్పోర్ట్ గుండా 60,85,396 మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఏడాది క్రితం ప్రయాణించిన వారితో పోలిస్తే 11 శాతం అధికం. ఇండోనేషియాలోని మెడాన్ ఎయిర్పోర్ట్, ఫిలిప్పీన్స్లోని సెబు ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించేవారి సంఖ్య కూడా పెరిగారు. సంస్థ నిర్వహిస్తున్న నాలుగు విమానాశ్రయాల గుండా 98,41,859 మంది ప్రయాణించినట్టు అయింది.
గత నెలలో జీఎమ్మార్ నిర్వహిస్తున్న రెండు విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య 19 శాతం పెరుగగా, విమానాలు 14 శాతం పెరిగాయి. ఢిల్లీ విమానాశ్రయం గుండా 36,643 విమానాలు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గుండా 14,746 విమాన సర్వీసులు ప్రయాణించాయి.