UPI Payment-Insurance | గ్రాసరీ మొదలు కూరగాయలు.. మొబైల్ రీచార్జి మొదలు యుటిలిటీ బిల్లులు.. విద్యా సంస్థల ఫీజులు.. ఒక్కటేమిటి.. దాదాపు అన్ని రకాల చెల్లింపులూ ఆన్లైన్లో డిజిటల్ పేమెంట్సే జరుగుతున్నాయి. యూపీఐ ఆధ్వర్యంలోని యాప్స్తో ప్రతి పేమెంట్స్ క్షణాల్లో జరిగిపోతున్నాయి.. అదే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులూ.. యూపీఐ యాప్స్ పరిధిలోకి తీసుకొస్తే.. బీమా రంగ స్వరూపమే మారిపోతుంది. ఇందుకోసం ఐఆర్డీఏ ప్రత్యేకంగా డిజిటల్ ప్లాట్ఫామ్ బీమా సుగమ్ ఏర్పాటుపైనే కసరత్తు చేస్తోంది. బీమా సుగమ్ ప్రకారం యూజర్లలో ఎవరైనా బీమా పాలసీ కొనుగోలు చేస్తే అన్ని రకాల వసతులూ ఈ బీమా సుగమ్లో లభిస్తాయి.
బీమా సుగమ్ ఆధ్వర్యంలో యూపీఐ పేమెంట్స్ మొదలైతే.. బీమా రంగంలో ఇన్సూరెన్స్ ఏజంట్లు, బ్రోకర్లు అంటే మధ్యవర్తుల పాత్ర దాదాపుగా ముగిసిపోతుంది. బీమా పాలసీల క్రయ విక్రయాలు తేలికవుతాయి. ఏజంట్ కమీషన్ రూపంలో బీమా రంగ సంస్థల ఖర్చులు తగ్గుతాయి. బీమా ప్రొడక్ట్ల ఖర్చు దిగి వస్తుందని బీమా సుగమ్ ఎండీ కం సీఈవో విగ్నేష్ సహానే చెప్పారు.
అన్ని బీమా సంస్థలు, కస్టమర్లు, బ్రోకర్స్ అసోసియేషన్లు అన్నీ బీమా సుగమ్ ప్లాట్ఫామ్ కిందకే వస్తాయి. లైఫ్, హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఆన్లైన్లోనే.. బీమా సుగమ్ ప్లాట్ఫామ్పైనే కొనుగోలు చేయొచ్చు.
బీమా సుగమ్తో ఇన్సూరెన్స్ కర్చు దిగి రావడమే పెద్ద బెనిఫిట్. ప్రస్తుతం ఇన్సూరెన్స్ బ్రోకర్లకు 30-40 శాతం కమీషన్ ఇస్తున్నారు. బీమా సుగమ్తో అది 5-8 శాతానికి పరిమితం అవుతుంది. దీనివల్ల బీమా ప్రీమియం కూడా తగ్గుతుంది.
అన్ని కంపెనీల పాలసీలు ఒకే ప్లాట్ఫామ్పై అందుబాటులో ఉండటంతో మీ కుటుంబ అవసరాలు, పరిస్థితులను బట్టి ఏది బెటర్ అన్నది తేలిపోతుంది. ప్రస్తుతం ఆన్లైన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్లు ఈ సేవలందిస్తున్నా.. మధ్యవర్తుల పాత్ర పోషిస్తుండటంతో ఖర్చు తడిసిమోపెడవుతుంది.
పాలసీ నంబర్తోనే పేపర్లెస్ క్లయిమ్ సెటిల్మెంట్ పూర్తవుతుంది. పాలసీ హోల్డర్లు, ఏజంట్లు, వెబ్ అగ్రిగేటర్లు.. బీమా సుగమ్ సేవలు వినియోగించుకోవచ్చు. పాలసీదారుల ఫిర్యాదుల పరిష్కారం తేలికవుతుంది.