RIL | న్యూఢిల్లీ, జూలై 21: దేశంలో అతిపెద్ద కార్పొరేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) క్యూ1 ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం నిరుడు ఇదేకాలంతో (రూ.17,955 కోట్లు) పోలిస్తే 11 శాతం క్షీణించి రూ. 16,011 కోట్లకు పడిపోయింది. ఇదే ఏడాది మార్చి క్వార్టర్తో (రూ.19,299 కోట్లు) పోలిస్తే లాభం 17 శాతం తగ్గింది. తాజాగా ముగిసిన మూడు నెలల కాలంలో ఆర్ఐఎల్ ఆదాయం సైతం 5.3 శాతం తగ్గి రూ.2.11 లక్షల కోట్లకు చేరింది. ముడి చమురు ధర దిగిరావడంతో సహజంగానే టర్నోవర్ క్షీణించింది. కంపెనీ లాభం రూ.16,400-16,900 కోట్ల మధ్య ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ప్రధాన వ్యాపారమైన ఆయిల్ టు కెమికల్ (ఓ2సీ) విభాగం బలహీనమైన పనితీరును కనపర్చడం, అధిక వడ్డీ చెల్లింపులు, తరుగుదల వ్యయాల కారణంగా నిరుత్సాహకరమైన ఫలితాల్ని ఆర్ఐఎల్ వెల్లడించింది. శుక్రవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.9 చొప్పున డివిడెండ్ సిఫార్సుచేసింది.
అధిక వడ్డీ రేట్ల ప్రభావం ఆర్ఐఎల్పై గట్టిగా పడింది. జూన్ త్రైమాసికంలో వడ్డీ చెల్లింపులు ఏకంగా 46 శాతం పెరిగి రూ.5,837 కోట్లకు చేరాయి. ప్రస్తుతం కంపెనీకి రూ.1.26 లక్షల కోట్ల నికర రుణం ఉంది. అలాగే తరుగుదల వ్యయాలు 32 శాతం అధికమై రూ.11,775 కోట్లకు పెరిగాయి. రిలయన్స్ వ్యాపారాలన్నింటిలో ఆస్తులు పెరగడం, డిజిటల్ సర్వీసుల వ్యాపారంలో నెట్వర్క్ వినియోగం ఎక్కువగా ఉన్నందున తరుగుదల వ్యయాలు పెరిగాయి. నిర్వహణాపరంగా చూస్తే ఆర్ఐఎల్ మొత్తంవ్యాపారాల ఇబిటా 5 శాతం వృద్ధితో రూ. 41,982 కోట్లకు చేరింది. కానీ ఓ2సీ వ్యాపారం ఇబిటా 23.2 శాతం తగ్గి రూ. 15,271 కోట్లకు పడిపోయింది. రిలయన్స్ రిఫైనర్లు ప్రపంచ మార్కెట్లో విక్రయించిన డీజిల్, పెట్రోల్, జెట్ ఫ్యూయల్కు నిరుడు జూన్ త్రైమాసికంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గరిష్ఠధరలకు చేరాయి. కానీ ఇప్పుడు మాంద్యం భయాలతో నిల్వలు మార్కెట్లోకి తరలిరావడం, అధిక వడ్డీ రేట్లు, చైనా ఉత్పత్తి పెంచడం వంటి అంశాలతో వాటి ధరలు పడిపోయాయని ఆర్ఐఎల్ వివరించింది. సమీక్షా త్రైమాసికంలో ఆర్ఐఎల్ పెట్రో ఎగుమతులు 28 శాతం తగ్గాయి.
ఆర్ఐఎల్ సబ్సిడరీ రిలయన్స్ రిటైల్ లాభాల జోరు చూపించింది. గ్రోసరి, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లైఫ్ైస్టెల్ విభాగాల కనపర్చిన వృద్ధి కారణంగా క్యూ1లో రిటైల్ లాభం 19 శాతం వృద్ధితో రూ. 2,448 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంతో రూ.2,061 కోట్ల లాభాన్ని సాధించింది. తాజా త్రైమాసికంలో రిటైల్ టర్నోవర్ రూ. 58,554 కోట్ల నుంచి 19.5 శాతం వృద్ధితో రూ. 62,159 కోట్లకు పెరిగింది. తమ రిటైల్ స్టోర్లు అన్నింటిలో కలిపి రికార్డుస్థాయిలో 24.9 కోట్ల మంది సందర్శించారని, కొత్తగా 555 స్టోర్లు ప్రారంభించామని ఆర్ఐఎల్ వెల్లడించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 18,446కు చేరింది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ టేకోవర్ పూర్తయ్యిందని, దానిని రిలయన్స్ రిటైల్ వ్యాపారాలతో ఇంటిగ్రేట్ చేసే ప్రక్రియ అమలులో ఉందని కంపెనీ తెలిపింది.
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు చేరుకోలేకపోయింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,863 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,335 కోట్ల కంటే ఇది 12 శాతం అధికం. 2022-23 తొలి త్రైమాసికంలో రూ.21,995 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.24,127 కోట్లకు ఎగబాకింది.
‘అంతర్జాతీయ అనిశ్చితి నడుమ మా ఓ2సీ వ్యాపారం స్థిరమైన పనితీరును కనపర్చింది. అందుబాటు ధరల్లో జియో అందిస్తున్న సేవలతో చందాదారుల బేస్ను పెంచుకున్నారం. 5జీ సర్వీసుల విస్తరణను వేగవంతం చేస్తున్నాం. కొత్త స్టోర్ల ఏర్పాటుతో రిటైల్ వ్యాపారం మంచి వృద్ధి సాధించింది. దేశంలో ఆర్థిక సేవల విస్తరణకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వినూత్నరీతిలో సిద్ధమై ఉంది.
-ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ