హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఔషధ, జీవశాస్ర్తాల వార్షిక సదస్సు ‘బయోఏషియా-2024 సమ్మిట్’కు మళ్లీ వేళైంది. మంగళవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభం కానున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ 21వ సదస్సులో 50 దేశాల నుంచి పరిశ్రమ, ప్రభుత్వాలకు చెందిన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, రెగ్యులేటరీ బాడీ ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశోధకులు, వ్యవస్థాపకులు తదితర 3,000 మందికిపైగా పాల్గొంటున్నారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన సీఈవోలు, ఇండస్ట్రీ లీడర్లుసహా దాదాపు 70మందిచేత ప్రసంగాలు, బృంద చర్చలు ఉండనున్నాయి. ‘డాటా, ఏఐ-రీడిజైనింగ్ పాసిబులిటీస్’ అనే థీమ్పై ఈసారి సదస్సును నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇక ఈ నెల 28 వరకు సదస్సును నిర్వహించనుండగా, సోమవారమే ప్రతినిధులు జీనోమ్ వ్యాలీని సందర్శించారు.
సుమారు 200లకుపైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ఈ సదస్సులో ప్రదర్శించనున్నాయి. బయోటెక్నాలజీ, లైఫ్సైన్సెస్ రంగాలకు చెందిన ప్రపంచస్థాయి ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున ఈ రంగాలకు చెందిన విజ్ఞాన మార్పిడికి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పవచ్చు. అలాగే ఫార్మా, బయోటెక్, లైఫ్సైన్సెస్, హెల్త్-టెక్, మెడ్టెక్ తదితర రంగాల్లో కొత్త స్టార్టప్ల ఆవిష్కరణలకూ ఇది వేదిక కానున్నది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడంపట్ల తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా దేశీయ, ప్రపంచ లైఫ్సైన్సెస్, దాని అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఈసారి సదస్సుకు అనేకమంది గ్లోబల్ సీఈవోలు మొదటిసారి హాజరవుతున్నారని తెలిపారు. సదస్సును అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకున్నట్టు మంత్రి వివరించారు.
ఈ సదస్సు నిర్వహణలో మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు 5 ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యమవుతున్నాయి. నోవార్టీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్, లారస్ ల్యాబ్స్, సాయి లైఫ్సైన్సెస్ కంపెనీలు హోస్ట్లుగా వ్యవహరించేందుకు ముందుకొచ్చినట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. లైఫ్సైన్సెస్ రంగంలో భారత్ను, తెలంగాణను ప్రపంచ కేంద్రంగా నిలబట్టే లక్ష్యంతో ఈసారి బయోఏషియా సదస్సు జరగనున్నది. సదస్సులో భాగంగా హెల్త్కేర్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖులచే చర్చలు ఉంటాయి. గత సదస్సుల్లో పలువురు నోబెల్ బహుమతి విజేతలు, వివిధ దిగ్గజ కంపెనీల అధిపతులు పాల్గొన్నారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలెక్స్ గోర్సీ తదితరులు సదస్సులో పాల్గొనే వారిలో ఉన్నారు.
బయోఏషియా సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పలువురు ప్రతినిధులు సోమవారం శామీర్పేట్లోని జీనోమ్ వ్యాలీని సందర్శించారు. సుమారు 200 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐకేపీ నాలెడ్జ్ పార్క్ (ఇంక్యూబేషన్ సెంటర్), నియోవెంటేజ్ (తక్షశిల) మల్టీ ట్యాలెంటెడ్ ఫెసిలిటీ, భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ లిమిటెడ్, సాయి లైఫ్సైన్సెస్ తదితర కంపెనీలను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రం లైఫ్సైన్సెస్ రంగంలో సాధించిన అభివృద్ధిని, విజయవంతంగా కొనసాగుతున్న ఇండస్ట్రియల్ క్లస్టర్లను ప్రతినిధులు కొనియాడారు. కాగా, మంగళ, బుధ వారాల్లో ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుంది. చివరి రోజు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన స్టార్టప్లకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.