ముంబై, ఫిబ్రవరి 24: గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ రుణాల బకాయిలు 18.1 శాతం పెరిగి రూ.162 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో గోల్డ్ లోన్లకు ఏర్పడిన గిరాకీ, పండుగల సీజన్, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) హేతుబద్ధీకరణ ఇందుకు కారణమని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (సీఐసీ) క్రిఫ్ హై మార్క్ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి.
కాగా, ఈ రిటైల్ రుణాల బకాయిల్లో గత త్రైమాసికం గృహ రుణాల వాటా అత్యధికంగా 10.50 శాతం ఎగిసింది. రూ.43 లక్షల కోట్లను తాకినట్టు సీఐసీ తెలిపింది. అలాగే గోల్డ్ లోన్ల బకాయిలు 44.1 శాతం వృద్ధితో రూ.16.2 లక్షల కోట్లకు, వ్యక్తిగత రుణాల బకాయిలు 11.6 శాతం పెరుగుదలతో రూ.15.90 లక్షల కోట్లకు చేరాయి. తగ్గిన జీఎస్టీ రేట్లు.. కార్లు, ద్విచక్ర వాహనాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లలో ఏడాది క్రితంతో పోల్చితే వరుసగా 14.60 శాతం, 12.30 శాతం, 14.30 శాతం చొప్పున వృద్ధికి దోహదం చేశాయి.