ఎనిమిది నెలల గరిష్ఠానికి రిటైల్ ధరల సూచీ
న్యూఢిల్లీ, మార్చి 14: ఫిబ్రవరిలో ఇటు టోకు ధరలు, అటు రిటైల్ ధరల మోత మోగింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో టోకు ద్రవ్యోల్బణం 13.11 శాతానికి చేరింది. వరుసగా రెండు నెలలపాటు స్వల్పంగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం క్రూడ్ ధర పరుగులు తీసిన ప్రభావంతో ఫిబ్రవరి నెలలో 13.11 శాతానికి చేరింది. 2021 ఏప్రిల్ నుంచి వరుసగా11 నెలల పాటు టోకు ధరల సూచి (డబ్ల్యూపీఐ) రెండంకెల్లో కొనసాగడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నెలలో ఇది 12.96 శాతం కాగా, గతేడాది ఫిబ్రవరిలో 4.83 శాతమే. ఫిబ్రవరి నెలలో టోకున ఆహారోత్పత్తుల ధరలు కాస్త తగ్గినప్పటికీ, రిటైల్గా మాత్రం ఇవి పెరిగాయి. దీంతో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతానికి పెరిగినట్టు ఎన్ఎస్వో తెలిపింది. ఇది 8 నెలల గరిష్ఠస్థాయి. అంతకు ముందు జనవరి నెలలో ఇది 6.01 శాతం కాగా, 2021 ఫిబ్రవరిలో 5.03 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య అదుపు చేయాలంటూ ఆర్బీఐని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ శ్రేణి గరిష్ఠ బ్యాండ్ 6 శాతంపైనే వరుసగా రెండో నెల సైతం రిటైల్ ద్రవ్యోల్బణం నిలవడం గమనార్హం.