న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : రిజర్వు బ్యాంక్ భవిష్యత్తులో వడ్డీరేట్లను పెంచితే గృహ విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని ఓ సర్వే వెల్లడించింది. ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతుండటం, మరోవైపు కార్పొరేట్ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సగటు ఉద్యోగిపై రిజర్వు బ్యాంక్ క్రమంగా వడ్డీరేట్లను పెంచడంతో ఇళ్లను కొనుగోలు చేయడానికి వెనుకంజవేస్తున్నారు. సీఐఐ, రియల్ ఎస్టేట్ సేవల సంస్థ అనరాక్ సంయుక్తంగా ‘ది హౌజింగ్ మార్కెట్ బూమ్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధిక మంది వడ్డీరేట్లు మరింత పెరిగితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా టాప్-7 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 4,662 మంది పాల్గొన్నారు.
ధరలు పెరిగే అవకాశం
గృహాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధిక మంది ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. దేశీయంగా టాప్-7 నగరాల్లో సరాసరిగా ఇండ్ల ధరలు 6-9 శాతం వరకు పెరగవచ్చునని అనరాక్ నివేదిక వెల్లడించింది. నిర్మాణ సంబంధించిన ముడి సరుకుల ధరలు పెరగడం, డిమాండ్ కూడా ఊపందుకోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది.
ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 4,662 మంది పాల్గొనగా..వీరిలో 42 శాతం మంది త్రీ-బెడ్రూమ్ గృహాలు కొనుగోలుకు ప్రాధాన్యతనిచ్చారు. 40 మంది రెండు-బెడ్రూమ్ గృహాలు, 12 శాతం మంది ఒక్క బెడ్రూం, 6 శాతం మంది మూడు బెడ్రూంల కంటే ఎక్కువ ఇండ్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
అంతర్జాతీయ దేశాల్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు గృహాల డిమాండ్పై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నది.
హైదరాబాద్తోపాటు ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నై, కోల్కతాలో ఈ సర్వే నిర్వహించింది.
‘ఇళ్ల కొనుగోలులో వడ్డీరేట్ల పెంపు ఒక అంశం మాత్రమే. ఇటీవలకాలంలో కార్పొరేట్ సంస్థల్లో భారీగా ఉద్యోగులను తొలగించడంతో వచ్చే రెండు త్రైమాసికాల్లో గృహాల డిమాండ్పై ప్రభావం చూపనున్నది.’
– అంజు పూరి, అనరాక్ గ్రూపు చైర్మన్