న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఇక నుంచి రూ.1 కోటి వరకూ ఫిక్స్డ్ డిపాజిట్లను (ఎఫ్డీలు) కాలపరిమితికంటే ముందుగానే తీసుకునే వెసులుబాటును రిజర్వ్బ్యాంక్ కల్పించింది. ఇప్పటివరకూ బ్యాంక్ల్లో రూ.15 లక్షల లోపు ఎఫ్డీలకే ముందస్తు విత్డ్రాయల్ సదుపాయం ఉంది. అంతకంటే మించి ఎఫ్డీ చేస్తే ఆ డిపాజిట్ కాలపరిమితి ముగిసేంతవరకూ లాక్ అవుతుంది. ఈ పరిమితిని సడలిస్తూ గురువారం బ్యాంక్లకు ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
నాన్- కాలబుల్ (ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్ ఆప్షన్ లేనివి) డొమెస్టిక్ టెర్మ్ డిపాజిట్ల (టీడీలు) కనీస పరిమితిని 15 లక్షల రూపాయిల నుంచి ఒక కోటి రూపాయిలకు పెంచుతున్నట్టు ఆర్బీఐ తెలిపింది. రూ.కోటి లోపు టీడీలకు ముందస్తు విత్డ్రాయల్ సదుపాయం కల్పించాలని బ్యాంక్లను ఆదేశించింది.
తక్షణమే అమలులోకి వచ్చే ఈ ఆదేశాలు నాన్-రెసిడెంట్ (ఎక్స్ట్రనల్) రూపీ (ఎన్ఆర్ఈ) డిపాజిట్లకు, ఆర్డినరీ నాన్-రెసిడెంట్ (ఎన్ఆర్వో) డిపాజిట్లకు వర్తిస్తాయన్నది. ఈ సర్క్యులర్ను అన్ని వాణిజ్య బ్యాంక్లు, సహకార బ్యాంక్లు అమలు చేయాలన్నది. ఇదే సమయంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ల బల్క్ డిపాజిట్ పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ.కోటికి పెంచుతున్నట్టు రిజర్వ్బ్యాంక్ తెలిపింది.
సాధారణంగా బ్యాంక్లు నాన్-కాలబుల్ ఎఫ్డీలపై అధిక వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఏడాది కాలపరిమితిగల నాన్-కాలబుల్ సర్వోత్తమ్ ఎఫ్డీపై వడ్డీ 7.10 శాతంకాగా, ఏడాది కాలపరిమితితో కూడిన సాధారణ ఎఫ్డీపై వడ్డీ రేటు 6.8 శాతం ఉన్నది. రెండేండ్ల నాన్-కాలబుల్ ఎఫ్డీపై 7.4 శాతం, రెగ్యులర్ ఎఫ్డీపై 7 శాతం చొప్పున వడ్డీని ఆఫర్ చేస్తున్నది.