న్యూఢిల్లీ : భారత్లో ఎంపిక చేసిన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రాగా ప్రస్తుత 4జీ సేవల కంటే అధిక మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా లేమని 5జీకి మారాలనుకునే వారిలో 43 శాతం మంది వెల్లడించారు. కాల్ డ్రాప్, నెట్వర్క్ సమస్యలు, తక్కువ వేగం వంటి సమస్యలు అధిగమించగలిగితే 5జీకి మారేందుకు పలువురు స్మార్ట్ఫోన్ యూజర్లు ముందుకొస్తారని ఓ నివేదిక వెల్లడించింది. 5జీ సేవల కోసం పది శాతం అధిక టారిఫ్ చెల్లించేందుకు తాము సిద్ధమని 43 శాతం మంది సంకేతాలు పంపారని ఆన్లైన్ కమ్యూనిటీ ప్లాట్ఫాం లోకల్సర్కిల్స్ నివేదిక వెల్లడించింది.
5జీ కోసం 25 నుంచి 50 శాతం చెల్లించేందుకు కేవలం రెండు శాతం మందే మొగ్గుచూపారు. ఇక 4జీ స్పీడ్స్ కనెక్టివిటీ, ప్రాంతాన్ని బట్టి 40-50 ఎంబీపీఎస్ వేగం సపోర్ట్ చేస్తుండగా 5జీ సర్వీసులు 300ఎంబీపీఎస్ స్పీడ్స్ను సపోర్ట్ చేస్తాయని చెబుతున్నారు. ఇక భారత్లో తొలుత 5జీ సేవలను హైదరాబాద్, గురుగ్రాం, సిలిగురి, కోల్కతా, లక్నో, పూణే, ముంబై, గాంధీనగర్, జామ్నగర్, ఢిల్లీ, చండీఘఢ్, వారణాసి, చెన్నై, బెంగళూర్, అహ్మదాబాద్ నగరాల్లో అందించేందుకు రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సన్నాహాలు చేపట్టాయి.
మరోవైపు ఈ ఏడాదిలో 5జీకి మారేందుకు సర్వే పలుకరించిన వారిలో కేవలం 5 శాతం మందే సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇక 20 శాతం మంది తమకు ఇప్పటికే 5జీ డివైజ్ ఉందని చెప్పుకొచ్చారు. మరో నాలుగు శాతం మంది 5జీ స్మార్ట్ఫోన్ను ఈ ఏడాది కొనుగోలు చేస్తామని చెప్పగా 20 శాతం మంది వచ్చే ఏడాది 5జీ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేస్తామని తెలిపారు. భారత్లో స్మార్ట్ఫోన్ వినియోగించే 50 కోట్ల మంది యూజర్లలో ఈ ఏడాది చివరి నాటికి 10 కోట్ల మంది 5జీ డివైజ్ను కలిగిఉంటారని భావిస్తున్నారు.