ముంబై, జూన్ 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగానే ఉంచింది. అంచనాలకు తగ్గట్టుగా రెపోరేటు జోలికి వెళ్లకుండానే రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షనూ గురువారం ముగించింది. ఆరుగురు సభ్యులున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈసారి కూడా వడ్డీరేట్లను ఎక్కడివక్కడే ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపోరేటు 6.5 శాతం వద్దే ఉన్నది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాల నేపథ్యంలోనే వరుసగా రెండో ద్రవ్యసమీక్షలోనూ ఆర్బీఐ వడ్డింపులకు దిగలేదు. నిరుడు మే నెల నుంచి ఆర్బీఐ రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్లో జరిగిన ద్రవ్యసమీక్షలో ఈ పెంపునకు బ్రేక్ వేసింది. ఈ వైఖరినే తాజా ద్రవ్యసమీక్షలోనూ కనబర్చగా.. రుణగ్రహీతలకు పెద్ద ఉపశమనమే లభించినైట్టెంది. ఇదిలావుంటే సహకార బ్యాంకులు త్వరలోనే రుణ ఎగవేతదారులతో సంధిపూర్వక సెటిల్మెంట్లకు దిగుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్యసమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ క్రమంలోనే నిరర్థక ఆస్తుల (మొండి బకాయిలు లేదా ఎన్పీఏ)కు సంబంధించి సాంకేతిక రైటాఫ్లూ ఉంటాయన్నారు.
విదేశాల్లో పర్యటించే భారతీయుల సౌకర్యార్థం దేశంలోని బ్యాంకులు రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీ చేసేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. ఏటీఎంలు, పీవోఎస్ మెషీన్లు, ఆన్లైన్ విదేశీ వ్యాపారుల వద్ద వీటిని వినియోగించుకోవచ్చు. అలాగే రూపే డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులను బ్యాంకులు విదేశాల్లోనూ జారీ చేసుకోవచ్చన్నది. భారత్సహా అంతర్జాతీయంగా చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఈ సందర్భంగా చెప్పింది.
ఈ ఏడాదిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని, వచ్చే ఏడాది ఫిబ్రవరి సమీక్షలోనే తొలి వడ్డీరేట్ల కోతకు వీలుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త అభిక్ బరువా అంటున్నారు. ఈ ఏడాదిలో జరిగే తదుపరి ద్రవ్యసమీక్షల్లోనూ వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచుతుందని, ఆ తర్వాత జరిగే ద్రవ్యసమీక్షల్లోనే కోతల దిశగా అడుగులు వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. డీబీఎస్ గ్రూప్ సీనియర్ ఆర్థికవేత్త రాధికా రావు, క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి, యూబీఎస్ ఇండియా ఆర్థికవేత్త తన్వీగుప్తా జైన్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
వడ్డీరేట్ల పెంపు విషయంలో ఇది విరామం మాత్రమే. ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగానే తదుపరి ద్రవ్యసమీక్షలు సాగుతాయి. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా వడ్డీరేట్ల పెంపునకూ వీలుంటుంది. ద్రవ్యోల్బణంపై దృష్టి పెట్టడం తప్పనిసరి. ఈసారి వర్షపాతం ఎలా ఉంటుందనేది కీలకం. మరోవైపు ఎల్నినో ప్రభావంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలన్నదే మా లక్ష్యం.
-శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
‘మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగానే ఆర్బీఐ ద్రవ్యసమీక్ష నిర్ణయాలున్నాయి. ద్రవ్యోల్బణం ఇంకా తగ్గుముఖం పడితే మున్ముందు వడ్డీరేట్లు దిగే అవకాశాలున్నాయి’
-అతుల్ గోయెల్, పీఎన్బీ ఎండీ, సీఈవో
‘వరుసగా రెండు ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లలేదు. దీన్నిబట్టి చూస్తే రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందనిపిస్తున్నది’
-సుభ్రకాంత్ పాండా, ఫిక్కీ అధ్యక్షుడు
‘రూపే ప్రీపెయిడ్ ఫారె క్స్ కార్డుల జారీకి ఆర్బీఐ అనుమతించడాన్ని స్వాగతిస్తున్నాం. బ్యాంకింగ్ వ్యవ స్థ బలోపేతానికి ఆర్బీఐ కృషి చేస్తున్నది’
-దీపక్ సూద్, అసోచామ్ ప్రధాన కార్యదర్శి
‘ఆర్బీఐ నిర్ణయం నిర్మాణ రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపగలదు. ద్రవ్యోల్బణం తగ్గుతున్నందున రెపోరేటును తగ్గిస్తే లాభదాయకంగా ఉంటుంది’
-బొమన్ ఇరానీ, క్రెడాయ్ జాతీయాధ్యక్షుడు