Jio | రిలయన్స్ జియో విదేశీ ఆర్థిక సంస్థలు, దేశీయ బ్యాంకుల నుంచి రూ.5700 కోట్ల (750 మిలియన్ల డాలర్లు) నిధులు సేకరించనున్నది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, క్రెడిట్ అగ్రికోల్, హెచ్సెస్బీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్, ఎంయూఎఫ్జీ, మిజుహు, ఎస్ఎంబీసీ సంస్థలు సిండికేట్గా ఐదేండ్ల పరిమితి గల రుణం అందిస్తాయి. ఈ వారంలో పైన పేర్కొన్న సంస్థల సిండికేట్తో రిలయన్స్ జియో ఒప్పందంపై సంతకాలు చేయనున్నదని సమాచారం. రిలయన్స్ జియో తన భవిష్యత్ అవసరాల కోసం ఈ రుణాలు సేకరించనున్నదని తెలుస్తున్నది. త్వరలో 5జీ స్పెక్ట్రం వేలం ప్రారంభం కానుండగా, జియో రుణాలు తీసుకోనుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతోపాటు అననుకూల ఆర్థిక స్థితిగతులు ఇబ్బందికరంగా ఉన్నాయి. అయినా ఈ రుణం తీసుకోవడం వల్ల ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో.. విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసం పొందడానికి ఉపకరిస్తుందని సమాచారం. 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడానికి ముందు గత (2014, 2015) బకాయిలను చెల్లించడానికి జనవరిలో కార్పొరేట్ బాండ్ల ద్వారా జియో రూ.8,000 కోట్ల నిధులు సేకరించింది.
5జీ స్పెక్ట్రం వేలంపై అనుసరించాల్సిన విధి విధానాలపై ఈ నెలాఖరులోగా సిఫారసులు అందించాలని ట్రాయ్ను కేంద్రం కోరింది. వచ్చే మే నెలలో 5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. తొలిదశ 5జీ స్పెక్ట్రం ఆగస్టు 15 నాటికి వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని కేంద్రం కోరుకుంటున్నది. 5జీ స్పెక్ట్రం వేలంలో రిలయన్స్ జియో గట్టి పోటీదారుగా నిలువనున్నది.