ముంబై, అక్టోబర్ 3: దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. అగ్గువ ధరకే ఓ బడ్జెట్ ల్యాప్టాప్ను మార్కెట్లోకి తేనున్నది. 4జీ సిమ్ కార్డుతో రానున్న ఈ ల్యాప్టాప్ ధర రూ.15,000 (184 డాలర్లు). ఇప్పటికే ఖరీదైన స్మార్ట్ఫోన్ల మార్కెట్లోకి చౌక ధరకే జియోఫోన్ను రిలయన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘జియోబుక్’ పేరుతో ఓ ల్యాప్టాప్నూ పరిచయం చేయాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. స్థానికంగా ‘జియోబుక్’ను ఉత్పత్తి చేసేందుకు ఫ్లెక్స్ అనే సంస్థతో కాంట్రాక్టూ కుదిరిందని అంటున్నారు.
క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్ పొత్తు
ల్యాప్టాప్ కోసం గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలైన క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్లతో జియో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నది. ఇక ఆర్మ్ లిమిటెడ్ నుంచి కంప్యూటింగ్ చిప్స్, విండోస్ ఓఎస్ తయారీదారైన మైక్రోసాఫ్ట్ నుంచి యాప్లు ఈ ల్యాప్టాప్లోకి రానున్నాయి. కాగా, ఈ నెల నుంచే పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల వంటి సంస్థాగత వినియోగదారులకు ల్యాప్టాప్లు అందుబాటులోకి రావచ్చని తెలుస్తున్నది. ఆ తర్వాత 3 నెలల్లోగా మార్కెట్లో దీన్ని వాణిజ్యపరంగా సాధారణ కస్టమర్ల కోసం ఆవిష్కరించాలని చూస్తున్నారు. నిరుడు దేశీయ మార్కెట్లోకి దాదాపు 1.5 కోట్ల ల్యాప్టాప్లు దిగుమతయ్యాయి. ఇందులో హెచ్పీ, డెల్, లెనోవో ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో భారతీయ ల్యాప్టాప్ మార్కెట్లో కనీసం 15 శాతం వాటాను ‘జియోబుక్’తో ఆక్రమించాలని రిలయన్స్ చూస్తున్నది.
జియో ఓఎస్తోనే..
ఈ ల్యాప్టాప్ జియో సొంత ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) జియోఓఎస్తోనే పని చేయనున్నది. అలాగే ఇందులో యాప్స్ (అప్లికేషన్లు) అన్నీ కూడా జియోస్టోర్ నుంచే డౌన్లోడ్ అవుతాయి. కాగా, దీన్ని టాబ్లెట్స్కు ప్రత్యామ్నాయంగా కూడా కార్పొరేట్ ఉద్యోగులు వాడుకోవచ్చని రిలయన్స్ జియో అంటున్నది. మొత్తానికి వచ్చే ఏడాది మార్చికల్లా మార్కెట్లో ‘జియోబుక్’ మోత మోగించాలన్న లక్ష్యంతో రిలయన్స్ అడుగులేస్తున్నది. అనంతరం జియోఫోన్ 5జీని పరిచయం చేయాలని కంపెనీ భావిస్తున్నట్టు చెప్తున్నారు. గత ఏడాది ఆఖర్లో విడుదలైన దగ్గర్నుంచి ఇప్పటిదాకా రూ.8 వేల లోపు ధర కలిగిన స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో జియోఫోనే అగ్రస్థానంలో ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా జియోకు 42 కోట్ల వినియోగదారులున్న సంగతి విదితమే.