Reliance Jio | టెలికం మేజర్ రిలయన్స్ జియో నికర లాభాల్లో 28.29 శాతం వృద్ధి సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.3,615 కోట్ల నుంచి రూ.4,638 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో 2.65 శాతం గ్రోత్ నమోదు చేసుకుంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4,518 కోట్ల నికర లాభం పొందింది.
ఆపరేషన్ల ద్వారా రిలయన్స్ జియో ఆదాయం రూ.22,998 కోట్లకు చేరుకున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 18.87 శాతం పెరుగుదల. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ.19,347 కోట్ల ఆదాయం సముపార్జించింది రిలయన్స్ జియో.
డిసెంబర్ త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది రిలయన్స్ జియో. గత త్రైమాసికంలో రూ.23,362 కోట్ల ఆదాయం వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేయగా, అది రూ.22,998 కోట్లకు మాత్రమే పరిమితమైంది. సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే దాదాపు మూడు శాతం నికర లాభం పెంచుకున్న జియో.. ఆదాయంలో మాత్రం 13.3 శాతం వెనుకబడింది. సంస్థ నెట్వర్క్ నిర్వహణ వ్యయం 16 శాతం రూ.7,227 కోట్లకు చేరుకున్నది.