Reliance Jio | రిలయన్స్ జియో ఖాతాలో 29.4 లక్షల మంది కస్టమర్లు కొత్తగా జత కలిశారు. జూలైలో కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకున్న తీసుకున్న మొబైల్ యూజర్ల డేటాను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గురువారం తెలిపింది. జూన్లో 4.20 లక్షల నూతన సబ్స్క్రైబర్లు కలిశారు. సునీల్ మిట్టల్ సారధ్యంలోని భారతీ ఎయిర్టెల్లో జూలైలో కొత్తగా ఐదు లక్షల మంది చేరారు. తద్భిన్నంగా వొడాఫోన్ ఐడియా గత జూలైలో 1.54 మిలియన్ల మంది, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 13,27,999, ఎంటీఎన్ఎల్ 3039 మంది కస్టమర్లను కోల్పోయాయి.
జూలై నాటికి దేశంలోనే అత్యధిక మొబైల్ యూజర్ పునాది గల టెలికం సంస్థగా రిలయన్స్ జియో నిలిచింది. జూలై 31 నాటికి జియో కస్టమర్లు 415.96 మిలియన్ల మంది కాగా, ఎయిర్టెల్కు 363.4 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వొడాఫోన్ ఐడియాకు 255.1 మిలియన్ యూజర్లు కొనసాగుతున్నారు. మొత్తంగా గత జూలైలో కొత్తగా ఏడు లక్షల మంది ఖాతాదారులు పెరిగి 1.17 మిలియన్ల మందికి చేరింది. జూన్లో కొత్త సబ్స్క్రైబర్లు 2.22 మిలియన్లు చేరారు.
పట్టణ ప్రాంతాల్లో జూలై నెలాఖరు నాటికి మొత్తం మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్లు 649.09 మిలియన్ల నుంచి 650.40 మిలియన్లకు చేరింది. రూరల్ ప్రాంతాల్లో అరుదుగా సబ్స్క్రిప్షన్లు తగ్గుముఖం పట్టాయని ట్రాయ్ తెలిపింది. గ్రామాల్లో 523.87 మిలియన్ల నుంచి 523.26 మిలియన్ల మందికి చేరింది. అంటే గ్రామాల్లో టెలికం సంస్థలు ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయాయి.