ముంబై, ఫిబ్రవరి 13: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఖాతాలో ఓ అరుదైన ఘనత చేరింది. బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ హెవీ వెయిట్ షేర్ల సంస్థ మార్కెట్ విలువ.. మంగళవారం ఏకంగా రూ.20 లక్షల కోట్లను దాటేసింది. ఇంట్రా-డే ట్రేడింగ్లో ఈ రికార్డు నమోదవగా, ఈ గుర్తింపును సాధించిన తొలి భారతీయ సంస్థగా ఆర్ఐఎల్ చరిత్రకెక్కింది. సోమవారం ముగింపుతో పోల్చితే ఒకానొక దశలో 1.88 శాతం పుంజుకొని రిలయన్స్ షేర్ విలువ బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో రూ.2,957.80 స్థాయిని తాకింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ రూ.20,01,279.72 కోట్లుగా నమోదైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన మరే భారతీయ సంస్థ మార్కెట్ విలువ కూడా ఈ స్థాయికి చేరలేదు. అయితే షేర్ విలువ మళ్లీ పడిపోవడంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా దిగజారింది. చివరకు 0.90 శాతం వృద్ధితో రూ.2,928.95 వద్ద స్థిరపడింది. మార్కెట్ విలువ కూడా రూ.19,81,635. 72 కోట్లకు పరిమితమైంది. అటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ట్రేడింగ్లోనూ రిలయన్స్ షేర్ విలువ ఆకట్టుకున్నది. ఒకానొక దశలో 52 వారాల గరిష్ఠాన్ని తాకుతూ 1.89 శాతం పెరిగి రూ.2,958 స్థాయికి వెళ్లింది. చివరకు 0.74 శాతం లాభంతో రూ.2,926.20 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. తిరిగి లాభాల్లోకి వచ్చాయి. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 482.70 పాయింట్లు లేదా 0.68 శాతం పుంజుకొని 71,555.19 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో 71,662.74 పాయింట్ల గరిష్ఠాన్ని అందుకోగా.. 70,924.30 పాయింట్లు కనిష్ఠానికీ దిగజారింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 127.20 పాయింట్లు లేదా 0.59 శాతం అందుకుని 21,700 స్థాయికి ఎగువన 21,743.25 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఐటీ రంగాల షేర్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది.
జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడం కలిసొచ్చినట్టు చెప్తున్నారు. షేర్ల వారీగా చూస్తే.. సెన్సెక్స్లో ఐసీఐసీఐ బ్యాంక్ గరిష్ఠంగా 2.46 శాతం పెరిగింది. యాక్సిస్ బ్యాంక్, విప్రో, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు కూడా పెరిగాయి. రంగాల వారీగా.. సర్వీసెస్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు 1.45 శాతం, 1.44 శాతం, 1.23 శాతం చొప్పున పుంజుకొన్నాయి. ఎనర్జీ, టెక్ రంగాలు కూడా 1.03 శాతం, 0.40 శాతం చొప్పున లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ 0.18 శాతం, మిడ్క్యాప్ సూచీ 0.61 శాతం మేర పెరిగాయి. ప్రధాన ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా లాభాల్లో.. హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి.
గడిచిన రెండు వారాల్లో రిలయన్స్ మార్కెట్ విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఎగబాకింది. ఈ ఆయిల్ టు టెలికం కంపెనీ.. ఇప్పటికే మార్కెట్ విలువ ప్రకారం టాప్-10 దేశీయ సంస్థల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రిలయన్స్ తర్వాత దేశీయ ఐటీ రంగ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉన్నది. మూడో స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉండగా, ఆ తర్వాత వరుసగా ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీ ఎయిర్టెల్, హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్), ఐటీసీ సంస్థలున్నాయి.
కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో గత నెలే సంస్థ మార్కెట్ విలువ రూ.19.56 లక్షల కోట్లను తాకింది. కానీ నిరుడు మార్చిలో రూ.18 లక్షల కోట్ల మార్కును అధిగమించగా.. రూ.20 లక్షల కోట్లను చేరడానికి ఎంతో సమయం పట్టకపోవడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో రిలయన్స్ నికర లాభం 9 శాతం పెరిగి రూ.17,265 కోట్లుగా ఉన్న సంగతి విదితమే.