Reliance | ముకేశ్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) సరికొత్త రికార్డు నెలకొల్పింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం ట్రేడింగ్ మొదలైన తర్వాత సంస్థ స్టాక్ తాజా గరిష్ట స్థాయిని తాకడంతో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20 లక్షల కోట్ల మార్కును దాటేసింది. అంతర్గత ట్రేడింగ్లో రిలయన్స్ స్క్రిప్ట్ 1.89 శాతం పుంజుకుని తాజా 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,957.80ని తాకింది.
గత రెండు వారాల్లోనే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లు పెరిగింది. గత జనవరి 29న రూ.లక్ష కోట్ల ఎం-క్యాప్ పెంచుకుని రూ.19 లక్షల కోట్ల మార్కును దాటేసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి సంస్థ షేర్ దాదాపు 14 శాతం పెరిగింది. ముంబై కేంద్రంగా ముడి చమురు నుంచి టెలికం వరకు వివిధ రంగాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. దలాల్ స్ట్రీట్లో అత్యధిక సంపద సృష్టికర్తల్లో ఒకటిగా నిలిచింది.
2005 ఆగస్టు నాటికి రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మైలురాయిని దాటింది. రూ.10 లక్షల ఎం-క్యాప్ మైలురాయిని దాటేందుకు 14 ఏండ్లు పట్టింది. 2019 నవంబర్ నాటికి రిలయన్స్ ఎం-క్యాప్ రూ.10 లక్షల కోట్లు దాటింది. తిరిగి మరో రూ.10 లక్షల కోట్ల ఎం-క్యాప్ పెంచుకోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్’కు నాలుగున్నరేండ్లు పట్టింది.
బీఎస్ఈలో రూ.20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గల అతిపెద్ద సంస్థగా రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.15 లక్షలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.10.5 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ రూ.7 లక్షల కోట్ల చొప్పున మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్నాయి.