Homes | కరోనా మహమ్మారి ప్రభావంతో అన్ని రంగాలతోపాటు కుదేలైన రియాల్టీ రంగం.. కీలక వడ్డీరేట్లు తగ్గించడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. వర్క్ ఫ్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి అమల్లోకి రావడంతో ఉద్యోగులు, కుటుంబాలు.. విస్తారమైన ఇండ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక కరోనా మహమ్మారి ప్రభావంతో వివిధ బిల్లుల చెల్లింపులు.. కార్లు.. గ్రాసరీ.. మెడిసన్స్.. అన్నీ ఆన్లైన్లోనే సాగుతున్నాయి. ఇండ్ల విక్రయాలూ ఆన్లైన్ దిశగా అడుగులేస్తున్నాయి. చాలా మంది డెవలపర్లు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్పైనే ఫోకస్ చేస్తున్నారు. 39 శాతం మంది రియాల్టీ డెవలపర్లు 25 శాతం సేల్స్ ఆన్లైన్లో చేపడుతున్నారని అంటున్నారు. అంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా డిజిటలైజేషన్ దిశగా పరివర్తన చెందుతున్నదన్న అభిప్రాయం వినిపిస్తున్నది.
ఇన్పుట్ కాస్ట్ నియంత్రణ, జీఎస్టీపై క్రెడిట్ ఇన్పుట్ ప్రతిపాదన, నిధుల లభ్యత పెంపు, శరవేగంగా ప్రాజెక్టులకు ఆమోదం వంటి అంశాలపైనే డెవలపర్స్ కమ్యూనిటీలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. పరిస్థితులు అనుకూలిస్తే న్యూ ప్రాజెక్టులు ప్రారంభించాలని 92 శాతం మంది డెవలపర్లు ప్రణాళికలు వేస్తున్నారు. అయితే.. కరోనాతో ముడి సరుకు ధరలు కూడా బాగానే పెరిగాయి. ప్రత్యేకించి ఇండ్ల నిర్మాణంలో కీలకమైన సిమెంట్, స్టీల్ తదితర ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయి.
ముడి సరుకు ధరల ప్రభావం ఇండ్ల ధరలపై పడుతుందని రియల్టర్స్ బాడీ క్రెడాయ్ నిర్వహించిన సర్వేలో తేలింది. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సెంటిమెంట్ సర్వే-2022
అనే పేరుతో కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) సర్వే నిర్వహించింది. ఇందులో ఇండ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని డెవలపర్లు అంచనా వేస్తున్నారు. మెజారిటీ డెవలపర్లు.. నూతనంగా చేపట్టే ప్రాజెక్టుల్లో కో-వర్కింగ్, కో-లివింగ్ మోడల్ ఇండ్లు, కార్యాలయాల నిర్మాణంపై ఆసక్తి చూపుతున్నారు.
60 శాతం మంది డెవలపర్లు ఈ ఏడాది 20 శాతం ఇండ్ల ధరలు పెరుగుతాయని చెప్పారు. సుమారు 35 శాతం మంది 10-20, 25 శాతం మంది 10 శాతం.. 21 శాతం మంది 20-30 శాతం ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కరోనా థర్డ్వేవ్లో పెరుగుతున్న కేసుల కట్టడికి ప్రభుత్వం అదనపు చర్యలు చేపడుతుందని అంచనా వేస్తున్నట్లు క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ పాటోడియా చెప్పారు. గత డిసెంబర్ 30 నుంచి జనవరి 11 వరకు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సెంటిమెంట్ సర్వే-2022 నిర్వహించారు. 1322 మంది డెవలపర్లు ఇందులో భాగస్వాములయ్యారు.