Real Estate | న్యూఢిల్లీ, మార్చి 16: దేశీయ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతున్నది. 2034 నాటికి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రియల్ఎస్టేట్ బాడీ క్రెడాయ్ అంచనావేస్తున్నది. ఇదే క్రమంలో 2047 నాటికి 5.17 ట్రిలియన్ డాలర్లను అధిగమించనున్నదని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్ సైజు రూ.24 లక్షల కోట్లు(300 బిలియన్ డాలర్లు)గా ఉన్నదని తెలిపింది. వీటిలో రెసిడెన్షియల్ మార్కెట్ రేషియో 80 శాతంగా ఉండనుండగా, కమర్షియల్ రంగ వాటా 20 శాతమని శనివారం విడుదల చేసిన ‘బిల్డింగ్ వికసిత్ భారత్’ నివేదికలో పేర్కొంది.
దేశీయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం వచ్చే పదేండ్లలో ఎన్నో రెట్లు పెరగనున్నదని తెలిపింది. 2033-34 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడీపీలో 13.8 శాతం వాటాతో 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటున్నదని అంచనావేసిన నివేదిక..2047 నాటికి జీడీపీలో 17.5 శాతం వాటాతో 5.17 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటున్నదని పేర్కొంది.