రూ.61 వేల కోట్లతో రాజీవ్ సింగ్ అగ్రస్థానం
హురున్ ఇండియా రియాల్టీ శ్రీమంతుల జాబితా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ దేశంలో రియల్ ఎస్టేట్ శ్రీమంతుల్లో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. గత ఏడాదికాలంగా ఆయన సంపద 68 శాతం వృద్ధిచెంది రూ. 61,220 కోట్లకు చేరినట్టు గ్రోహ్ హురున్ ఇండియా నివేదిక తెలిపింది. మాక్రోటెక్ డెవలపర్స్ అధిపతి ఎంపీ లోధా రూ.52,970 కోట్ల సంపదతో ద్వితీయస్థానంలో న్నారు. భారత్లో అత్యంత ధనికులైన రియల్ ఎస్టేట్ వాణిజ్యవేత్తలతో కూడిన ‘గ్రోహ్ హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్’ ఐదో ఎడిషన్ బుధవారం విడుదలయ్యింది. ఆయా వాణిజ్యవేత్తలకు సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారం నికర విలువలో ఉన్న వాటా ఆధారంగా జాబితాను రూపొందించారు. 2021 డిసెంబర్ 31నాటికి శ్రీమంతుల సంపదను లెక్కించారు.
నివేదిక ప్రకారం అగ్రస్థానంలో ఉన్న డీఎల్ఎఫ్ రాజీవ్ సింగ్ సంపద ఏడాదికాలంలో 68 శాతం పెరగ్గా, లోధా కుటుంబం సంపద 20 శాతం వృద్ధిచెందింది. ఏడాది క్రితం రాజీవ్ సింగ్ ప్రథమస్థానంలో ఉన్నారు. తాజా జాబితాలో రహేజా గ్రూప్నకు చెందిన చంద్రు రహేజా కుటుంబం రూ.26,290 కోట్ల సంపదతో తృతీయస్థానంలో ఉంది. ఎంబసీ గ్రూప్ నేత జితేంద్ర వీర్వాని రూ.23,620 కోట్ల సంపదతో నాల్గవస్థానంలోనూ, ఒబేరాయ్ రియల్టీకి చెందిన వికాస్ ఒబేరాయ్ (రూ.22,780 కోట్లు) ఐదో స్థానంలో ఉన్నారు. హిరానందన్ కమ్యూనిటీస్కు చెందిన నిరంజన్ హిరానందని (రూ.22,250 కోట్లు), ఎం3ఎం ఇండియాకు చెందిన బసంత్ బన్సాల్ కుటుంబం (రూ.17,250 కోట్లు), బాగ్మనే డెవలపర్స్కు చెందిన రాజా బాగ్మానే (రూ.16,730 కోట్లు) వరుసగా 6,7,8 స్థానాల్లో ఉన్నారు.
టాప్టెన్లో హైదరాబాదీ
గ్రోహ్ హురున్ ఇండియా జాబితాలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఏఆర్ కార్పొరేషన్ అధిపతి జి అమరేందర్ రెడ్డి కుటుంబం చోటు దక్కించుకుంది. రూ. 15,000 కోట్ల సంపదతో తొమ్మిదో స్థానంలో అమరేందర్ రెడ్డి ఉన్నారు. రన్వాల్ డెవలపర్స్ అధిపతి సుభాష్ రన్వాల్ కుటుంబం రూ. 11,400 కోట్ల సంపదతో పదో స్థానాన్ని పొందింది. దేశంలోని 14 నగరాల్లో 71 కంపెనీలకు చెందిన 100 మందితో ఈ 2021 సంవత్సరపు శ్రీమంతుల జాబితాను రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పలువురు రియల్ ఎస్టేట్ ఐశ్వర్యవంతులు లిస్ట్లో ఉన్నారు. అంతక్రితం ఏడాది జాబితా నుంచి 13 మంది తప్పుకోగా, అంతేసంఖ్యలో కొత్త ఐశ్వర్యవంతులు చేరారు. అమరేందర్ రెడ్డి జాబితాలో కొత్తగా ప్రవేశించారు. లిస్ట్లో 81 శాతం మంది శ్రీమంతుల సంపద పెరిగింది. వీరి సగటు వయస్సు 61 సంవత్సరాలుగా ఉంది. జాబితాలోని మొత్తం శ్రీమంతుల సంపద సంవత్సర కాలంలో 30 శాతం పెరిగి రూ.4,53,700 కోట్లకు చేరినట్టు హురున్ ఇండియా ఎండీ అనాస్ రహ్మాన్ జునైద్ తెలిపారు.