న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందంటూ రిజర్వ్బ్యాంక్ ప్రకటించిన అంచనాల్ని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా తిరస్కరించింది. ఆర్బీఐ అంచనాలు ‘చాలా ఆశాభావం’తో కూడుకున్నాయని, వృద్ధి 5.3 శాతానికి తగ్గుతుందంటూ నోమురా అంచనాల్ని ప్రకటించింది.
ధరల పెరుగుదలపై ఆర్బీఐ అంచనాలతో తాము ఏకీభవిస్తున్నామని, గరిష్ఠ ద్రవ్యోల్బణం రోజులు ముగిసాయని, కానీ జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతానికి పెంచడం చాలా ఎక్కువ అని అభిప్రాయం వ్యక్తం చేసింది. పలు ఏజెన్సీలు,విశ్లేషకులు 2023-24 సంవత్సరానికి వృద్ధి అంచనాలకు ఇటీవల కోత పెట్టిన సంగతి తెలిసిందే. అధిక శాతం మంది 6 శాతం దిగువనే వృద్ధి రేటును అంచనా వేస్తున్నారు.
ఆర్బీఐ వృద్ధి అంచనాకంటే వాస్తవ వృద్ధి 1 శాతాన్ని మించి తగ్గుతుందని నోమురా తాజా అంచనాల్లో పేర్కొంది. అంతర్జాతీయ వృద్ధి మాంద్యం, అనిశ్చిత పరిస్థితుల కారణంగా రిజర్వ్బ్యాంక్ వృద్ధి అంచనాలు తగ్గుతాయన్నది. తాజా పాలసీ ప్రకటన సందర్భంగా తాము క్రూడ్ సగటు ధర అంచనాలను 90 డాలర్ల నుంచి 85 డాలర్లకు కుదించినందున, జీడీపీ వృద్ధి అంచనాల్ని పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వివరించారు. అలాగే వడ్డీ రేట్ల పెంపునకు సైతం కేంద్ర బ్యాంక్ బ్రేక్ వేసిన విషయం విదితమే.
అక్టోబర్లో రేట్ల తగ్గింపు
గత 11 నెలల్లో పెంచిన 2.50 శాతం వడ్డీ రేట్ల పెంపుల ప్రభావాన్ని విశ్లేషించుకోవడానికి ఆర్బీఐకి సమయం పడుతుందని, దీంతో ఏప్రిల్ మీట్ తరహాలోనే వచ్చే జూన్ పాలసీ సమీక్షలో కూడా రేట్ల పెంపు ఉండదని నోమురా అంచనా వేసింది. జూన్ తర్వాత ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుముఖం పడుతుందని, వృద్ధి కూడా నిరుత్సాహపరుస్తుందని, ఈ నేపథ్యంలో అక్టోబర్ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవచ్చని నోమురా అంచనాల్లో వివరించింది.
ప్రపంచ వృద్ధి 3 శాతంలోపే
వాషింగ్టన్: ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతం దిగువకే పరిమితం కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జియావా అంచనా వేశారు. కరోనా పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం ప్రభావం.. ఈ ఏడాది కూడా ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే రాబోయే ఐదేండ్లు ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు 3 శాతంలోపే ఉండవచ్చని అభిప్రాయపడ్డా రు. 1990 నుంచి గమనిస్తే మీడియం-టర్మ్కు సంబంధించి ఇదే మా అత్యంత తక్కువ వృద్ధి అంచనా అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. నిజానికి గడిచిన రెండు దశాబ్దాల్లోనూ ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు సగటు 3.8 శాతంగా ఉన్నట్టు గుర్తుచేశారు. కాగా, ఈసారి వరల్డ్ ఎకానమీ గ్రోత్లో సగం వాటా భారత్, చైనాలదే ఉండొచ్చని చెప్పారు.