న్యూఢిల్లీ, నవంబర్ 3: రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువన ఉంచడంలో ఎందుకు విఫలమయ్యామో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్బ్యాంక్ ఒక సంజాయిషీ లేఖ పంపనుంది. వివిధ అంశాల్ని చర్చించి, లేఖలో పొందుపర్చేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన గురువారం మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశమయ్యింది.
ఎంపీసీ సభ్యులు మైఖేల్ దేబబ్రత పాత్రా, రాజీవ్ రంజన్, శశాంక్ భిడే, అషీమా గోయల్, జయంత్ ఆర్ వర్మ ఈ భేటీలో పాల్గొన్నట్టు ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతానికి మించకుండా కట్టడి చేయాలని ఆర్బీఐని కేంద్రం నిర్దేశించింది. వరుసగా తొమ్మిది నెలలపాటు ఇది 6 శాతం ఎగువనే కొనసాగుతున్నది. 2016లో అమల్లోకి వచ్చిన మానిటరీ కమిటీ ఫ్రేమ్వర్క్ ప్రకారం మూడు వరుస త్రైమాసికాల్లో నిర్దేశిత లక్ష్యంలో వైఫల్యం చెందితే, అందుకు గల కారణాల్ని, తగ్గుదలకు చేపడుతున్న చర్యల్ని కేంద్రానికి లిఖితపూర్వకంగా ఆర్బీఐ వివరించాలి.
ప్రస్తుతానికి రేట్లపై నిర్ణయం లేనట్లే
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా నాల్గోసారి 0.75 శాతం వడ్డీ రేటును పెంచిన నేపథ్యంలో ఆర్బీఐ కమిటీ తాజా సమావేశంలో రేట్లపై నిర్ణయం వెలువడుతుందన్న అంచనాలు మార్కెట్లో ఉన్నాయి. అయితే కేవలం కేంద్రానికి రాసే లేఖలో అంశాల్ని చర్చించేందుకే భేటీ జరిగినట్టు ఆర్బీఐ ప్రకటన వెల్లడించింది.