న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజు సుంకాల్ని తగ్గించాల్సి ఉందని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ వాదించారు. రెపో రేటును పావుశాతం పెంచినప్పటి ఫిబ్రవరి 8 నాటి ఆర్బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశపు మినిట్స్ బుధవారం విడుదలయ్యాయి. ఈ మినిట్స్ ప్రకారం అషిమా గోయిల్ రేట్ల పెంపును వ్యతిరేకిస్తూ ఓటు చేశారు. పలు సరఫరా అడ్డంకుల కారణంగా ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో కొనసాగుతున్నందున మరిన్ని ఎక్సయిజు సుంకాల్ని తగ్గించాలని సమీక్షలో గోయల్ కోరారు. గత వడ్డీ రేట్ల పెంపు ప్రభావం వ్యవస్థలోకి చొచ్చుకువెళ్లడానికి, ద్రవ్యోల్బణం నెమ్మదించడానికి, వృద్ధి కుదుటపడటానికి కొంత సమయం ఇవ్వాలని వాదించారు.
ఈ వాదనల కారణంగా తాను ‘న్యూట్రల్’ పాలసీకి మారుతున్నట్టు తెలిపారు. రేట్ల పెంపును వ్యతిరేకిస్తూ ఓటు చేసిన మరో ఎంపీసీ సభ్యుడు జయంత్ వర్మ మాట్లాడుతూ ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుతూ, వృద్ధి పట్ల ఆందోళనలు పెరుగుతున్నందున 25 బేసిస్ పాయింట్ల రేట్ల పెంపు అవాంఛనీయమన్నారు. అందుకే రేట్ల పెంపునకు వ్యతిరేకంగా ఓటు చేస్తున్నానన్నారు. ఆరుగురు సభ్యులుగల ఎంపీసీలో నలుగురు పావుశాతం రేట్ల పెంపునకు అనుకూలంగా ఓటు చేశారు.