RBI MPC Meet | ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష (ఎంపీసీ) సమావేశం నవంబర్ మూడో తేదీన జరుగనున్నది. ఆరు శాతానికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో వైఫల్యాలకు కారణాలను కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇంతకముందు సెప్టెంబర్ 28 – 30 మధ్య ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం జరిగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5-7 తేదీల మధ్య జరుగాల్సి ఉంది. సెప్టెంబర్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్బీఐ 50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఇండ్ల రుణాలతోపాటు వివిధ రకాల లోన్లు పిరం అయ్యాయి.
ప్రధాన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం ప్రాధాన్యం అని ఆర్బీఐ ఎంపీసీ సభ్యులు శశాంక్ భిడే చెప్పారు. ఆహారం, ఇంధనంపై పరోక్ష ప్రభావం చూపే ద్రవ్యోల్బణంతోపాటు ఓవరాల్గా ద్రవ్యోల్బణ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లి 7.4 శాతం వద్దకు చేరుకున్నది. వచ్చే మార్చి నాటికి ద్రవ్యోల్బణం ఆరు శాతానికి దిగి వస్తుందని శశాంక్ భిడే పేర్కొన్నారు. నవంబర్ మూడో తేదీన జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్ల పెంపుతోపాటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రెండో దశ చర్యలు తీసుకుంటారా.. లేదా.. అన్నది తేలాల్సి ఉంది.