న్యూఢిల్లీ, మే 16: ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్బ్యాంక్ ఈ ఏడాది ఆగస్టుకల్లా మరో 0.75 శాతం రెపోరేటును పెంచుతుందని ఎస్బీఐ ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ పెంపుతో రెపో రేటు కొవిడ్ ముందస్తుస్థాయి 5.15 శాతం వద్దకు చేరుతుందన్నారు. ఇటీవల ఆర్బీఐ హఠాత్తుగా రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల (0.4 శాతం) మేర పెంచడంతో ఇది 4.4 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని, దీంతో వచ్చే జూన్, ఆగస్టు సమీక్షా సమావేశాల్లో ఆర్బీఐ వరుసగా రేట్లను పెంచుతుందని ఎకానమిస్టులు తెలిపారు. పెరిగిన ద్రవ్యోల్బణంలో 59 శాతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంవల్ల వచ్చిందేనని వారు తేల్చిచెప్పారు. ఫిబ్రవరి నెలను బేస్గా తీసుకుని తాము జరిపిన అధ్యయనంలో ఆహార, పానీయాల ధరలు, ఇంధనం, విద్యుత్, రవాణా ఛార్జీల పెరుగుదలలో 52 శాతం యుద్ధం కారణంగానే అధికమయ్యాయని, మిగిలిన 7 శాతం ప్రభావం ఎఫ్ఎంసీజీ రంగంలో ముడి ఉత్పత్తుల వ్యయానిదని ఎస్బీఐ ఆర్థికవేత్తలు వివరించారు.