RBI Guidelines | రూ.2000 విలువైన నోటును చలామణి నుంచి నిలిపేస్తున్నట్లు శుక్రవారం సంచలన నిర్ణయం ప్రకటించింది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ). ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో, దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో వాటిని మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంపై బ్యాంకుల ఖాతాదారులు, సాధారణ ప్రజల్లో నెలకొన్న సందేహాలకు ఆర్బీఐ జవాబులిచ్చింది.
రోజువారీగా ప్రతి లావాదేవీకి డబ్బు చెల్లించాల్సిందే. అకస్మాత్గా రూ.2000 నోటు విత్ డ్రా చేస్తున్న ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సామాన్యులను మరోమారు ఇక్కట్లలోకి నెట్టేసింది. ప్రతి రోజూ రూ.20 వేల వరకు మాత్రమే మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో ఎంత మొత్తంలోనైనా డిపాజిట్ చేయవచ్చునని ఆర్బీఐ జారీ చేసిన ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడించింది.
ఏ బ్యాంకులోనైనా రూ.2000 నోట్ల మార్పిడికి అనుమతి ఇచ్చినా.. ఆ బ్యాంకుకు చెందిన ఒక శాఖలో మాత్రమే రూ.20 వేలు మార్చుకునేందుకు వీలు కల్పించింది. బ్యాంకుల్లో డిపాజిట్లకు మాత్రం సంబంధిత ఖాతాదారులు కేవైసీ, ఇతర నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
ఎన్ని నోట్లైనా సరే డిపాజిట్ చేయడానికి అనుమతి ఇస్తూనే, అవసరాలకు అనుగుణంగా ఆ మనీ విత్ డ్రాయల్స్ కు ఓకే చెప్పింది. బ్యాంకుల్లోని బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా ప్రతి రోజూ రూ.4000 వేలు (రెండు రూ.2000 నోట్లు) మాత్రమే మార్చుకునేందుకు పరిమితులు విధించింది.
ఇప్పుడు రూ.2000 విలువైన నోటు చెల్లుబాటవుతుందని ప్రకటించిన ఆర్బీఐ.. సాధారణ లావాదేవీలకు ఉపయోగించవచ్చునని హామీ ఇచ్చినా.. సెప్టెంబర్ 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి రూ.2000 నోటు చలామణి నుంచి విత్ డ్రా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సామాన్యుడి నుంచి కార్పొరేట్ల వరకు.. ప్రతి ఒక్కరూ వాటితో లావాదేవీలు జరుపాలన్నా అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. రోజువారీగా పనులు చేసే సాధారణ ప్రజలు, కార్మికులు ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులే బ్యాంకుల ముందు బారులు తీరడం కష్ట సాధ్యం. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు అసౌకర్యం కలుగకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు సూచనలు ఇచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్ర స్థాయిలో సామాన్యులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులన్నీ రూ.2000 నోట్ల డిపాజిట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అనూహ్యంగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల శనివారం నుంచే బ్యాంకుల ముందు ఖాతాదారులు బారులు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఖాతాదారులు తరలి వస్తే బ్యాంకుల యాజమాన్యాలు వారికి సౌకర్యాలు కల్పించగలరా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
తమకందే సేవల్లో లోపం జరిగినా.. సంబంధిత ఖాతాదారుడు ఆయా బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ తెలిపింది. అలా ఫిర్యాదు చేసిన నెల లోపు సంబంధిత బ్యాంకు సమాధానం ఇవ్వకపోయినా.. ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేకపొయినా.. ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మెన్ స్కీం కింద ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.
1934-ఆర్బీఐ చట్టంలోని 24 (1) సెక్షన్ ప్రకారమే రూ.2000 నోటు తెచ్చామని ఆర్బీఐ ప్రకటించింది. పాత పెద్దనోట్ల రద్దు తర్వాత.. ప్రజల్లో నోట్లకు గల డిమాండ్కు సరిపడా కరెన్సీని మార్కెట్లో అందుబాటులో ఉంచడానికే రూ.2000 నోటు తెచ్చామని వివరణ ఇచ్చింది. ప్రజలకు అవసరమైన కరెన్సీ అందుబాటులోకి వచ్చినందున 2018-19లోనే రూ.2000 నోటు ముద్రించడం నిలిపేశామని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2000 విలువైన నోట్లన్నీ 2017కు ముందు ముద్రించినవేనని, వాటి జీవిత కాలం కేవలం నాలుగైదేండ్లేనని స్పష్టం చేసింది.
RBI on Rs.2000| రూ.2000 నోటును ఉపంహరించుకున్న ఆర్బీఐ
Rs.2000 Note Circulation | తగ్గుతున్న రూ.2000 నోటు సర్క్యులేషన్.. వెల్లడించిన ఆర్బీఐ
2000 Note | 2000 నోటు ముద్రణ నిలిపేశాం.. స్పష్టం చేసిన కేంద్రం!
రూ.2000 నోటుకు ఆర్బీఐ రాంరాం!!